తెలుగు సినిమా అంటే ఇంతే.. దాని స్థాయి ఇంతే అనుకునేవారికి గట్టి సమాధానమిచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇంతకు ముందు కూడా టాలీవుడ్ నుండి ఎందరో దర్శకులు తమ కథలతో, మేకింగ్‌తో ప్రపంచ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. కానీ రాజమౌళి మాత్రం వారందరికంటే ఒక్క మెట్టు ఎక్కువ ఎక్కేశాడు. తన సినిమాలతో తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చాడు. దాంతో పాటు తన ఖాతాలో ఎన్నో ఘనతలు, కొత్త కొత్త రికార్డులు జతచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఈ దర్శక ధీరుడు. ఇక రాజమౌళి సక్సెస్‌ను చూసి ఆశ్యర్యపోని సినీ ప్రేమికుడు లేడు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించింది. అంతే కాకుండా ఆయన కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఒక స్పెషల్ వీడియోను షేర్ చేసింది.


అంతర్జాతీయంగా ‘బాహుబలి’..
రేణు దేశాయ్ కొన్నాళ్ల క్రితం వరకు అసలు తను ఎక్కడుంది, ఏం చేస్తుంది లాంటి విషయాలు ప్రేక్షకులకు పెద్దగా తెలియనివ్వలేదు. కానీ గత కొంతకాలంగా మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తన ప్రొఫెషనల్ విషయాలకంటే పర్సనల్ విషయాలనే ఎక్కువగా నెటిజన్లతో షేర్ చేసుకుంటోంది. తాజాగా నార్వేలో స్టావెంజర్ అనే థియేటర్లో ‘బాహుబలి’ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. ఈ సినిమా వచ్చి ఎన్నో ఏళ్లు అయిపోయింది. అయినా కూడా టాలీవుడ్ ఫేట్‌ను మార్చేసిన మూవీ ఏది అంటే చాలామందికి టక్కున గుర్తొచ్చేది ‘బాహుబలి’. అందుకే స్టావెంజర్ థియేటర్లో కూడా ప్రదర్శనకు ఇది సిద్ధమయ్యింది. ఈ ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమా, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో పాటు రేణూ దేశాయ్‌కు కూడా ఆహ్వానం అందిందట.


మాటల్లో చెప్పలేని అనుభవం..
ఒక ఇంటర్నేషనల్ వేదికపై.. ఒక ఇండియన్ సినిమాకు.. అది కూడా తెలుగు సినిమాకు ఈ రేంజ్‌లో ఆదరణ చూస్తే ఎవరికైనా అదొక అందమైన అనుభవాన్నే అందిస్తుంది. రేణూ దేశాయ్‌కు కూడా అదే జరిగిందట. అక్కడి థియేటర్లో ‘బాహుబలి’ని చూస్తున్నప్పుడు, తనకు కలిగిన అనుభవం గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది రేణూ. ‘‘ఒక ఇండియన్ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడం చూస్తుంటే గర్వంగా ఉంది. ప్రేక్షకులగా మాకోసం మీరు ఇచ్చిన ఈ ఎక్స్‌పీరియన్స్‌ను మాటల్లో చెప్పలేను. స్టావెంజర్‌లో ఇలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేయడానికి నన్ను, అకీరాను అక్కడికి ఆహ్వానించినందుకు శోభు గారికి థ్యాంక్స్ అనే మాట చాలా తక్కువ’’ అంటూ ప్రేక్షకులంతా నిలబడి ‘బాహూబలి’కి చప్పట్లు కొట్టిన వీడియోను రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.






‘టైగర్ నాగేశ్వర రావు’తో మళ్లీ తెరపైకి..
రేణూ దేశాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్ల దగ్గర నుండి పలు నెగిటివ్ కామెంట్స్ కూడా అందుకుంటోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్‌పై రేణూపై పలువురు నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఎవ్వరు ఏమన్నా చూసి వదిలేయకుండా వారికి స్పందించే మనస్థత్వం రేణూ దేశాయ్‌కు ఉంది. అందుకే అలా నెగిటివ్ కామెంట్స్ చేసిన వారి గురించి చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తనకు కామన్‌గా మారిపోయింది. ఇవన్నీ పక్కన పెట్టి తన కెరీర్‌ను కొత్తగా ప్రారంభించాలనుకుంటున్న రేణూ.. త్వరలోనే రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’లో కీలక పాత్రలో కనిపించనుంది.


Also Read: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ‘జైలర్’, రూ. 500 కోట్లు వసూళ్ళు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial