Ram Charan - Upasana: పెళ్లయ్యాక ప్రతి మగవాడు భార్యకు సేవలు చెయ్యాల్సిందే. అది ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా, స్టార్ హీరో అయినా తప్పదు మరి. ఇంటి పనులు చేయడం దగ్గర నుంచి, షాపింగ్ వెళ్తే బ్యాగులు మొయ్యడం వరకూ.. ఎన్నో విషయాల్లో సతీమణికి సహాయం చెయ్యాల్సి ఉంటుంది. అవసరమైతే అప్పుడప్పుడు కాళ్ళు కూడా నొక్కాల్సి వస్తుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరిస్థితి కూడా సేమ్ అలానే ఉంది. తాజాగా ఆయన తన భార్య కాళ్లు నొక్కుతున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.


ఉపాసన కొణిదెల - రామ్ చరణ్.. టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2012 జూన్ 14న ప్రేమ వివాహం చేసుకున్న ఈ మెగా జంట.. ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే వీరిద్దరూ శుక్రవారం అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసం స్పెషల్ ఫ్లైట్ లో గుజరాత్ వెళ్ళారు. ఈ సందర్భంగా విమానంలో నిద్ర పోతున్న తన భార్య కాళ్ళు నొక్కుతూ కనిపించారు చెర్రీ. దీన్ని తమ కెమెరాలో బంధించిన సన్నిహితులు, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. 






మెగా వారసుడు తన సతీమణి కాళ్ళు నొక్కడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రామ్ చరణ్ కు బెస్ట్ హస్బెండ్ అవార్డ్ ఇవ్వాలని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే, వాళ్ళ అన్యోన్యమైన దాంపత్యానికి ఇలాంటి వీడియోలే నిదర్శమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 'ఆయన మీకు గ్లోబల్ స్టారేమో.. నాకు మాత్రం పాద దాసుడే' అని ఉపాసన అనుకుంటున్నట్లుగా వుందని ఇంకో నెటిజన్ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. ఏ అమ్మాయికైనా ఇలా సేవలు చేసే అబ్బాయే భర్తగా రావాలని కోరుకుంటారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చెర్రీ RRR ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు, అక్కడ ఉపాసన బ్యాగులు మోస్తూ కనిపించిన ఫోటో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.


అనంత్ అంబానీ - రాధికా మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ ఈవెంట్‌లో మెగా కపుల్ సందడి...
ఇదిలా ఉంటే బిజినెస్ టైకూన్ ముకేశ్ అంబానీ చిన్న కొడుకు వివాహానికి మెగా కపుల్ కు ఆహ్వానం అందినట్లుగా గత రెండు రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటిని నిజం చేస్తూ గుజరాత్‌ జామ్‌ నగర్‌ లో జరిగిన అనంత్‌ అంబానీ - రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో రామ్ చరణ్ - ఉపాసన దంపతులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాయి. వీరితో పాటుగా షారుఖ్ ఖాన్ దంపతులు, అమీర్‌ ఖాన్‌, అనిల్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌, కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌, అజయ్‌ దేవగణ్‌, మాధురీ దీక్షిత్‌, శ్రద్ధా కపూర్‌, దిశా పటానీ, అనన్య పాండే లాంటి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు.


ఇక సినిమాల విషయానికొస్తే.. RRR తో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ దక్కించుకున్న రామ్ చరణ్, దానికి తగ్గట్టుగానే కొత్త ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దీని తర్వాత బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో RC 16 మూవీ చేయనున్నారు చెర్రీ. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.


Also Read: ‘గామీ’ కంటే ముందు హిమాలయాల్లో చిత్రీకరించిన తెలుగు సినిమాలివే, ఒక్కోదానికి ఒక్కో కథ!