Rajinikanth: కొందరు సినీ సెలబ్రిటీలు ఎంత ఫేమ్, పాపులారిటీ సంపాదించుకున్నా కూడా సింపుల్‌గా ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఒకరు. రజినీ ఎంత సింపుల్‌గా ఉండాలనుకుంటారో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు సూపర్ స్టార్. కావాలనుకుంటే ఆయన విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం చేయవచ్చు. కానీ రజినీ మాత్రం ఎకానమీలో ప్రయాణించడానికే ఇష్టపడ్డారు. అదే సమయంలో హీరో జీవా కూడా అదే ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా.. తను షేర్ చేసిన ఫోటోల ద్వారా ఈ విషయం బయటికొచ్చింది.






రజినీతో ఫోటోలు..


ప్రస్తుతం రజినీకాంత్ తన అప్‌కమింగ్ మూవీ ‘వెట్టయాన్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతోంది. ఇక్కడ షెడ్యూల్ పూర్తి అవ్వడంతో తరువాతి షెడ్యూల్ కోసం చెన్నై బయల్దేరింది మూవీ టీమ్. అదే సమయంలో సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) కోసం చెన్నైకు బయల్దేరింది చెన్నై రైనోస్ టీమ్. అనుకోకుండా ఎయిర్‌పోర్టులో రజినీకాంత్‌ను కలిసింది ఈ టీమ్. అంతే కాకుండా తనతో కలిసి టీమ్ మెంబర్స్ అంతా ఫోటోలు కూడా దిగారు. ముఖ్యంగా హీరో, చెన్నై రైనోస్ కెప్టెన్ అయిన జీవా అయితే రజినీతో కాసేపు ముచ్చటించి, ప్రత్యేకంగా ఫోటో కూడా తీసుకున్నాడు. దీంతో రజినీకాంత్ ఎకానమీలో ప్రయాణిస్తున్నారన్న విషయం బయటికొచ్చింది.






గెలిచే తిరిగొస్తాం..


‘చెన్నై రైనోస్ టీమ్‌పై తలైవా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో చెన్నై రైనోస్ టీమ్ ఫ్లైట్ షేర్ చేసుకున్నారు. ఈ అనుకోని కలయిక వల్ల ఉత్సాహం పొందిన టీమ్.. కచ్చితంగా గెలుపును ఇంటికి తీసుకొస్తుంది’ అంటూ జీవా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతే కాకుండా రజినీకాంత్‌తో ప్రత్యేకంగా దిగిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. జీవా మాత్రమే కాదు.. రజినీకాంత్‌ను ఎకానమీ క్లాస్‌లో చూసిన కొందరు ఫ్యాన్స్ సైతం తన ఫోటోలను, వీడియోలను తీసుకున్నారు. అంతే కాకుండా కొందరు ఫ్యాన్స్ అయితే ఆయనతో ముచ్చటించే ప్రయత్నం కూడా చేశారు. తనతో మాట్లాడడానికి వచ్చిన ఫ్యాన్స్‌తో రజినీ నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






Also Read: ఏడ్చి ఏడ్చి చిరంజీవి తెల్ల చొక్కా అంతా తడిసిపోయింది, నీ కాకి గోలేంట్రా అంటూ అతడిని తోసేశారు: డైరెక్టర్ వంశీ