Reasons for YS Jagan and YSRCP defeat In AP Assembly Elections 2024: హీరోలకు పర్సనల్ లైఫ్ ఉంటుంది. రాజకీయ నేతలకు కష్టమే? ప్రయివేటుగా ఉన్నప్పుడు మీ జీవితం మీ ఇష్టం, పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చినప్పుడు మేం ఏమైనా అంటామన్నట్టు ఒక్కోసారి ప్రత్యర్థులు వ్యవహార శైలి ఉంటుంది. వ్యక్తిగత జీవితాలపై బురద జల్లే కార్యక్రమాలకు ఏమాత్రం లోటు ఉండదు. అందుకు తాజా ఉదాహరణ జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయన మీద బురద జల్లుడు ప్రోగ్రామ్ వైసీపీ కొంప ముంచడంలో కీలక పాత్ర పోషించిందని ఇప్పుడు రాజకీయ నేతల్లో బలంగా వినబడుతోన్న మాట.


జనసేన పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి ఆయన వ్యక్తిగత జీవితం ఆయుధం అయ్యింది వైసీపీ నేతలకు. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేక పదే పదే పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చారు. ఛోటా మోటా నాయకులు పెళ్లిళ్లపై విమర్శలు చేశారని అనుకుంటే ఏదో అని ఊరుకోవచ్చు. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం పదేళ్లుగా ఒక్కటే పాట పాడుతూ వచ్చారు.


పెళ్లిళ్లు తప్ప పవన్ రాజకీయ జీవితం కనపడలేదా?
ఏపీ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు. కానీ, తన జనసేన పార్టీ సంపూర్ణ మద్దతును తెలుగు దేశం, బీజేపీలకు మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందింది. అందుకు పవన్ కళ్యాణ్ ఒక కారణం అని జగన్ మనసులో బలమైన ముద్ర పడింది.


రాజకీయంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను ఎదుర్కొనలేక ఆయన వ్యక్తిగత జీవితం మీద జగన్ మోహన్ రెడ్డి & వైసీపీ లీడర్స్ విమర్శలు చేయడం ప్రారంభించారనేది ప్రజల్లోకి బలంగా వెళ్లింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, చంద్రబాబు దత్తపుత్రుడు అని, ప్యాకేజ్‌ స్టార్‌ అని, నిలకడ లేని వ్యక్తి అని పలు విధాలుగా వెకిలి చేశారు. తెలుగు దేశం, జనసేన 2019లో విడివిడిగా పోటీ చేసినప్పటికీ... వైసీపీ విమర్శలు మారలేదు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా జగన్ రెడ్డితో పాటు ఆ నేతల తీరు మారలేదు. మళ్లీ మళ్లీ అవే విమర్శలు చేశారు. ఈసారి ఎన్నికలకు ముందు నాలుగు పెళ్లిళ్లు అన్నారు జగన్‌. 


ఒకానొక సమయంలో వైసీపీ విమర్శలకు పవన్ కళ్యాణ్ బదులు ఇచ్చారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకోలేదని, అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ విషయం వదిలేసి వైసీపీ తప్పుల్ని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్దానం సమస్య నుంచి రోడ్లు, ఇసుక, మద్యం వంటి విషయాల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం మొదలు పెట్టారు. అప్పుడూ పవన్ రాజకీయ జీవితం మీద కాకుండా వ్యక్తిగత జీవితంపై మాత్రమే వైసీపీ ఫోకస్ చేసింది. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ చదువుతారని చెబుతూ వచ్చింది. తమది రొటీన్ స్క్రిప్ట్ అనే సంగతి మర్చిపోయింది. దీన్ని ప్రజలూ గమనించారు.


ఆ ఒక్క లాజిక్ మర్చిపోయిన వైసీపీ నేతలు!
తమదాకా వస్తే గానీ ఏదీ తెలియదని ఓ సామెత. ఎన్నికలకు ముందు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నాయకులు, వైసీపీలో కొత్తగా చేరిన ముద్రగడ పద్మనాభం వంటి ఉద్దండులు వ్యవహరించిన తీరు వాళ్ళ ద్వంద వైఖరిని ప్రజల ముందు ఉంచింది.


పవన్ పెళ్లిళ్ల మీద, ఆయన రాజకీయ జీవితంపై పదే పదే విమర్శలు చేసే నాయకుల్లో అంబటి రాంబాబు, పేర్ని నాని ప్రముఖులు అని చెప్పాలి. గంట, అరగంట అంబటి రాంబాబు రసిక రాసలీలలు అంటూ కొన్ని వాయిస్‌లు, వీడియోలు బయటకు వచ్చాయి. వాటితో తనకు సంబంధం లేదంటూ ఆయన చెప్పిన మాటల్ని ప్రజలు విశ్వసించలేదు. పేర్ని నాని బదులు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ పేర్ని కిట్టు వీడియోలతో పాటు హిందూపురం గోరంట్ల మాధవ్ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. పవన్ పెళ్లిళ్ల మీద విమర్శలు చేసే వైసీపీ నేతలు పతివ్రతలు కాదనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. 


Also Read: పవన్ కోట్లలో ఒక్కడు... అప్పుడు త్రివిక్రమ్ చెబితే వైసీపీకి అర్థం కాలేదు, ఇప్పుడు ఘోరంగా బోల్తా కొట్టింది


ఎన్నికలకు ముందు అంబటి రాంబాబు అల్లుడు ఆయన మీద విమర్శల జడివాన మొదలు పెట్టారు. దాని వెనుక చంద్రబాబు ఉన్నారని ఆయన ఆరోపణలు చేశారు. తన కుమార్తె వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని చెప్పుకొచ్చారు. ప్రతి కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అదే అంబటి కొన్నేళ్ల క్రితం చిరంజీవి కుటుంబ వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. తనకు సంబంధం లేని విషయాల్లో దూరి మరీ జీవితా రాజశేఖర్ దంపతుల చేత ప్రెస్ మీట్ పెట్టించి మరీ చిరును తిట్టించే వరకు అంబటి ఊరుకోలేదు. ఆ విషయాన్ని జీవిత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వీడియో ఎన్నికలకు ముందు వైరల్ అయ్యింది. ముద్రగడ కుమార్తె జనసేనానికి మద్దతు పలకడం, ఆ తర్వాత ముద్రగడ వ్యవహరించిన తీరు సైతం ఆమోదయోగ్యంగా లేదు. పవన్ వ్యక్తిగత జీవితం మీద పోసాని, శ్యామల వంటి సినీ తారలతో పాటు తమ పార్టీ నేతల చేత పదే పదే విమర్శలు చేయించిన వైసీపీ ఒక్క లాజిక్ మరచింది... ఆ పార్టీ నేతలు అంబటి, ముద్రగడకు వ్యతిరేకంగా వాళ్ళ సొంత మనుషులు బయటకు వచ్చారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు వ్యతిరేకంగా ఆయన మనుషులు బయటకు రాలేదు.


Also Readఅల్లు అర్జున్ రాంగ్ స్టెప్ వేసినందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? 'పుష్ప 2'ను పవన్ ఫ్యాన్స్ చూస్తారా? మెగా మద్ధతు ఉంటుందా?


పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఇప్పటి వరకు బయటకు వచ్చింది లేదు. పవన్ అభిమానుల పేరుతో కొందరు ఆకతాయిలు చేసే కామెంట్లకు రేణూ దేశాయ్ ఘాటుగా స్పందిస్తారు తప్ప పిల్లలను ఎప్పుడూ తండ్రికి దూరంగా ఉంచలేదు. అంత ఎందుకు... ఎన్నికల్లో పవన్ విజయం సాధించిన తర్వాత వచ్చిన వీడియోల్లో పవన్ మూడో భార్య అన్నా లెజినోవాతో పాటు రేణూ దేశాయ్ ద్వారా కలిగిన కుమారుడు అకిరా నందన్ కనిపించారు. ఒకానొక సమయంలో పవన్‌ మీద రాజకీయ విమర్శలు చేయండి కానీ తన కుటుంబాన్ని లాగొద్దని చెప్పిన విషయం తెలిసిందే. చిరంజీవి, నాగబాబు మొదలుకుని రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్ వరకు మెగా ఫ్యామిలీ అంతా పవన్ వెంట నిలబడింది. జగన్ వెంట ఆయన సొంత చెల్లెలు షర్మిల, బాబాయ్ కుమార్తె సునీత నిలబడలేదు. సొంత ఫ్యామిలీకి అన్యాయం చేసి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని జనసేన నాయకులు ప్రశ్నించారు. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేసే ధోరణి ప్రజలు సైతం గమనించారు. పవన్ వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి ప్రజలకు సేవ చేయాలని జనసేనానిగా ఆయన చేసిన, చేస్తున్న కృషిని గమనించారు. భారీ విజయం అందించారు. జనసేన కంటే వైసీపీకి తక్కువ సీట్లు వచ్చాయంటే... ప్రజలు ఎవర్ని ఎక్కువగా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు.


ఘోర పరాజయం చెందే వరకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను జగన్ పేరు పెట్టి పిలిచింది లేదు. ఓడిపోయిన తర్వాత జనసేనాని పేరు పవన్ కళ్యాణ్ అని గుర్తొచ్చినట్టుంది. పవన్ కళ్యాణ్ గారూ అని సంబోధించారు. రాజకీయంగా తనను ఏ స్థాయిలోనైన విమర్శించినా తట్టుకుంటా అన్నారు జనసేనాని. కానీ మూడు పెళ్లిళ్లు అంటూ పవన్‌ భార్యలను రాజకీయాల్లోకి లాగడంతో పాటు ఆయన తల్లిపై సైతం కామెంట్స్ చేసి వైసీపీ నేతలు సరిదిద్దుకోలేని తప్పు చేశారు.


Also Readజనసేనాని పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కంగ్రాట్స్ - ట్రోల్ చేస్తున్న మెగా & జనసేన ఫ్యాన్స్!