పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన 'బ్రో' సినిమా విడుదలైంది. ఇప్పుడు పవన్ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు, రాజకీయ పార్టీ జనసేన (Janasena Party) అధినేత కూడా! 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' సినిమాల్లో ఆయన రాజకీయ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా సంభాషణలు ఉన్నాయి. మరి, 'బ్రో' సినిమాలో? అటువంటి సంభాషణలు ఉన్నాయా? అంటే... రెండు ఉన్నాయి. అందులో ఒక సన్నివేశంలో అయితే ఏపీ మంత్రి ఒకరు చేసిన నృత్యంపై పరోక్షంగా ఘాటైన సెటైర్లు వేశారు. 


శ్యాంబాబు ఎవరు? రాంబాబేనా?
'బ్రో' సినిమాలో స్పెషల్ సాంగ్ 'మై డియర్ మార్కండేయ' పాటలో ఉత్తరాది భామ ఊర్వశి రౌతేలా స్టెప్పులు వేశారు. ఆ పాటలో శ్యాంబాబు మీద సెటైర్లు పడ్డాయి. ఈ శ్యాంబాబు క్యారెక్టర్ చేసింది '30' ఇయర్స్ పృథ్వీ. ఇప్పుడు టైటిల్స్ కార్డులో పేరు పృథ్వీరాజ్ అని పడుతోంది.
'మై డియర్ మార్కండేయ...' పాటలో శ్యాంబాబుగా పృథ్వీరాజ్ గెటప్ చూస్తే... ఓ ఏపీ మంత్రి గతంలో చేసిన డ్యాన్స్ గుర్తుకు రాక మానదు. గెటప్ అంటే పెద్దగా డ్రస్ ఏమీ వేసుకోలేదు. ట్రాక్ ప్యాంటు & టీ షర్టులో మాత్రమే ఉంటారు. రెండు చేతులు ముందుకు పెట్టి  ఓ స్టెప్ వేస్తారు. అప్పుడు పాటను ఆపి ''శ్యాంబాబు వస్తున్న టెంపో ఏంటి? నువ్వు వేస్తున్న స్టెప్ ఏంటి?'' అని పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకుంటారు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 






సినిమాలో పృథ్వీ పేరు శ్యాంబాబు అయినప్పటికీ... ఏపీలో మంత్రిని ఉద్దేశించి ఆ క్యారెక్టర్ క్రియేట్ చేశారనేది అర్థం అవుతోంది. మ్యూజిక్ గురించి శ్యాంబాబుకు చెప్పే సీన్ ఒకటి ఉంటుంది. అప్పుడు 'నెక్స్ట్ ఏంటి?' అని పవన్ అడిగితే... 'సె...' అని శ్యాంబాబు చెబుతాడు. మీ టైపులో అందరూ ఎప్పుడూ దాని గురించి మాత్రమే ఆలోచించరని పవన్ చెబుతారు. అంతే కాదు... లలితకళల్ని వదిలేయమని ఘాటుగా చెప్పడం గమనార్హం. శ్యాంబాబు అంటే అంబటి రాంబాబు యేనా? అని సినిమా చూసిన ప్రేక్షకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 


దోపీడీలు, దౌర్జన్యాలు చేస్తామంటే ఊరుకునేది లేదు!
పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు రెండు సినిమాలతో పోలిస్తే... 'బ్రో'లో రాజకీయ సంభాషణలు తక్కువే. కథలో అందుకు ఆస్కారం కూడా లేదు. అయితే... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పేస్ తీసుకుని మరీ ఓ సీన్ రాశారు.


Also Read : 'బ్రో' రివ్యూ : ఎనర్జీతో అదరగొట్టిన పవన్ కళ్యాణ్ - మరి, సినిమా?


బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వస్తువులు ఉపయోగించినప్పటికీ, మళ్ళీ మన ఇంటికి వచ్చేటప్పుడు వాటిని అక్కడే వదిలేసి వస్తామని... బంధువుల ఇంట్లో మనం అతిథి అవుతామని, ఆ విధంగా భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ గెస్ట్ అని మార్కండేయులు పాత్రతో పవన్ కళ్యాణ్ చెబుతారు. అతిథిగా ఉండాలి తప్ప మా సొంతం, దోపీడీలు, దౌర్జన్యాలు చేస్తామంటే ఊరుకునేది లేదని ఆయన బలంగా చెబుతారు. ఆ సంభాషణలు రాజకీయ ప్రయాణానికి, ఓ తెలుగు రాష్ట్రంలో అధికార ప్రభుత్వాన్ని ఉద్దేశించినవి అని కొందరి అభిప్రాయం. అదీ సంగతి! ఈ శ్యాంబాబు క్యారెక్టర్, ఆ సీన్ మీద ఏపీ మంత్రి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.   


Also Read : ధనుష్ మాస్ విధ్వంసం - 'కెప్టెన్ మిల్లర్' టీజర్, ఆ యాక్షన్ మామూలుగా లేవుగా











ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial