ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ ధరల తగ్గింపుపై వివాదం కొనసాగుతోంది. పెంచేదే లేదంటూ అక్కడి ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. అయితే పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి వివాదాల జోలికి వెళ్లలేదు. పైగా  టిక్కెట్ రేట్ల పెంపునకు ఆమోదం తెలిపింది.  ఈ మేరకు  తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని గతంలో  సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం ఎటూ తేల్చి చెప్పలేదు. దీంతో వారు ఇటీవల కోర్టును ఆశ్రయించారు.


Also Read: ‘మీ విలాసాలు తగ్గించుకోండి’ ఏపీ మంత్రులకు గట్టిగా ఇచ్చిపడేసిన హీరో సిద్ధార్ధ


సినీ ఎగ్జిబిటర్లు, ఇతరులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలికంగా రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ... అధికారుల కమిటీ నిర్ణయాన్ని వీలైనంత త్వరగా ప్రకటించాలని ప్రభుత్వానికిసూచించింది.  కోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. థియేటర్లలో టికెట్‌ ధరల ఖరారుకు ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. సినీరంగ ప్రముఖులతో పలు దఫాలు చర్చలు జరిపిన అధికారుల కమిటీ  సిఫారసులు చేసింది.  ఆ సిఫారసుల మేరకుప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.


Also Read: హీరో నాని ఎవరో తెలీదు.. నాకు కొడాలి నానీనే తెలుసు, బైక్ అమ్మి పవన్ కల్యాణ్ కటౌట్లు కట్టా: మంత్రి అనిల్


తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం..  ఎసీ థియేటర్లలో రూ.50  నుంచి  రూ.150 మధ్య టిక్కెట్ రేట్లు ఉంటాయి. నాన్‌ ఎసీ థియేటర్లలో  రూ.30 నుంచి  రూ.70 వరకు ఉంటాయి. మల్టీప్లెక్స్‌ల్లో  రూ.100 ... రూ.250 మధ్య ఉంటాయి.  సింగిల్‌ థియేటర్లలో రిక్లైనర్‌ సీట్స్‌ ఉంటే గరిష్ఠంగా రూ.200 .. మల్టీప్లెక్స్‌లో రిక్లైనర్స్‌కు గరిష్ఠంగా రూ.300 టిక్కెట్ ఖరారుచేసుకోవచ్చు.  స్పెషల్‌ ఐమాక్స్‌ లార్జ్‌ స్క్రీన్  సింగిల్‌ థియేటర్లలో.. రూ.250 టిక్కెట్ ధరలను ఖరారు చేశారు.


Also Read: ఏపీలో "బొమ్మ" బంద్ ! రూల్స్ పాటించని సినిమాహాళ్లు పదుల సంఖ్యలో సీజ్ !


అయితే ఇప్పటి వరకూ ధియేటర్లలో టిక్కెట్లు కొంటే..  జీఎస్టీ వేరుగా ఉండదు. ఆన్‌లైన్‌లో టిక్కెట్ కొనుగోలు చేసినప్పుడు జీఎస్టీ విడిగా వసూలు చేస్తారు. ఇప్పుడు టిక్కెట్ ధర కాకుండా ప్రేక్షకుడి వద్దే జీఎస్టీ వసూలు చేసుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఇది కాకుండా  నిర్వహణ చార్జీల కింద ఏసీ థియేటర్లలో టికెట్‌ పై రూ.5, నాన్‌-ఏసీలో  టికెట్‌పై రూ.3 వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. టిక్కెట్లపై జీఎస్టీ, నిర్వహణ, ఆన్ లైన్ చార్జీల వివరాలు స్పష్టంగా ఉండాలని తెలంగాణ సర్కార్ ఆదేశించింది. 


Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి