యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులు ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న క్షణాలు ఈ రోజు వచ్చాయి. ఆయన కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. 


ఆస్కార్స్ తర్వాత రాజమౌళి వచ్చిన తొలి వేడుక
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఆ సినిమా దర్శకుడు, జక్కన్న అని తారక్ ముద్దుగా పిలుచుకునే రాజమౌళి ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయబోయే దర్శకుడు, 'కెజియఫ్' & 'సలార్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కూడా వచ్చారు. 


నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు.  


పూజా కార్యక్రమాల అనంతరం ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివకు ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ మీద చిత్రీకరించిన తొలి సన్నివేశానికి రాజమౌళి క్లాప్ ఇచ్చారు. నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 


హిందీ నిర్మాత టి సిరీస్ భూషణ్ కుమార్, తెలుగు నిర్మాతల్లో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నేని, కె.ఎస్. రామారావు, అభిషేక్ అగర్వాల్, నటులు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
     
ఓపెనింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన జాన్వీ
ఎన్టీఆర్ జోడీగా ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, హిందీ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించనున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. తెలుగులో జాన్వీకి తొలి చిత్రమిది. ఈ సినిమా ఓపెనింగ్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చారు. 


Also Read : ఇన్‌స్టాగ్రామ్‌లో తారకరత్న కుమార్తె ఎంట్రీ - ఫస్ట్ పోస్ట్ తండ్రి గురించే!


ఎన్టీఆర్, కొరటాలది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. 'ఆర్ఆర్ఆర్' లాంటి పాన్ ఇండియా, వరల్డ్ సక్సెస్ తర్వాత కొరటాలతో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు. ఇంతకు ముందు ఎన్టీఆర్ హిట్  సినిమాలైన 'బృందావనం'కి రచయితగా, 'జనతా గ్యారేజ్'కు దర్శకుడిగా కొరటాల పని చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కలయికలో పాన్ ఇండియా సినిమా రాబోతోంది.


కల్పిత దీవి... ఒక పోర్టులో!
హీరోగా ఎన్టీఆర్ 30వ సినిమా ఇది. అందుకని #NTR30 గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఓ కల్పిత దీవి, పోర్టు నేపథ్యంలో తెరకెక్కుతోందట. కథా నేపథ్యం ఈ ట్వంటీయెత్ సెంచరీ కాదని సమాచారం అందుతోంది. సెమీ పీరియడ్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేశారట కొరటాల శివ. హైద్రాబాదులో ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారు. భాగ్య నగరంలో కొంత... ఆ తర్వాత విశాఖ, గోవా ఏరియాల్లో మరి కొంత షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట. వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుందని, సీజీ అవసరం అయ్యే సన్నివేశాలను ముందు షూట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్లాన్ చేశారట.


Also Read 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?