భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనే ముద్రను తెలుగు చిత్రసీమ క్రమక్రమంగా చెరిపేస్తూ... తెలుగు సినిమా హద్దులు, సరిహద్దులను దాటి జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. తెలుగు సినిమాలకు వస్తున్న వసూళ్లు, అంతర్జాతీయ గుర్తింపు చూస్తుంటే... మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో స్వర్ణయుగం మొదలైందని చెప్పాలి. అందులో భాగమే అవార్డులు కూడా!


మరికొన్ని గంటల్లో నేషనల్ అవార్డుల ప్రదానం!
వసూళ్ళ పరంగానే కాదు... అవార్డుల విషయంలోనూ తెలుగు సినిమా తన దూకుడు ప్రదర్శించింది. 69వ జాతీయ అవార్డులలో మెజారిటీ పురస్కారాలను తెలుగు సినిమా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాకు ఆరు పురస్కారాలు వస్తే... 'పుష్ప : ది రైజ్' చిత్రానికి రెండు పురస్కారాలు వచ్చాయి. 


చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్
'పుష్ప : ది రైజ్' చిత్రానికి గాను ఉత్తమ కథానాయకుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు జాతీయ పురస్కారం లభించిన సంగతి ప్రేక్షకులకూ తెలుసు. ఈ అవార్డును స్వీకరించడానికి ఆల్రెడీ ఆయన ఢిల్లీ వెళ్లారు. మన 69 ఏళ్ళ జాతీయ పురస్కారాల్లో తొలిసారి తెలుగు హీరోకి ఉత్తమ కథానాయకుడిగా అవార్డు రావడం ఇదే తొలిసారి. దాంతో ఆయన సరికొత్త చరిత్ర లిఖించారు. 'పుష్ప' సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కూడా అవార్డు అందుకోనున్నారు. 


సిక్సర్ కొట్టిన 'ఆర్ఆర్ఆర్'
జాతీయ పురస్కారాల్లో 'ఆర్ఆర్ఆర్'కు మొత్తం ఆరు అవార్డులు వచ్చాయి. ఎంఎం కీరవాణికి ఈ సినిమాకు గాను ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా అవార్డు రాగా... ఆయన తనయుడు కాల భైరవకు 'కొమురం భీముడో...' సినిమాకు గాను  ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డుకు వచ్చింది. తండ్రి కుమారులు ఇద్దరూ ఒకే రోజు ఒకే వేదికపై పురస్కారాలు అందుకోనుండటం రాజమౌళి కుటుంబానికి విశేషమే. 


'ఉప్పెన' ఉత్తమ తెలుగు సినిమాగా, 'కొండపొలం'లో 'ధమ్ ధమ్ ధమ్...' పాటకు ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ పురస్కారాలు అందుకోనున్నారు. జాతీయ పురస్కారాలు ప్రదానం చేసే వేదికపై తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఎక్కువ మంది కనిపిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ రోజు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు జరిగే పట్టాభిషేకం తెలుగు ప్రజలకు గర్వకారణం.  


Also Read రోజాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా - మహేష్‌తో సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్
 
ఉత్తమ నటిగా 69వ జాతీయ పురస్కారాల్లో ఇద్దరు హిందీ కథానాయికలు నిలిచారు. 'గంగూబాయి కథియావాడి' చిత్రంలో నటనకు గాను ఆలియా భట్, 'మిమి'లో నటనకు కృతి సనన్ పురస్కారం కైవసం చేసుకున్నారు. 'మిమి' చిత్రంలో నటనకు పంకజ్ కపూర్ ఉత్తమ సహాయ నటుడిగా నిలిచారు. తమిళ కథానాయకుడు, భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న మాధవన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'రాకెట్రి' సినిమా ఉత్తమ జాతీయ సినిమాగా నిలిచింది. సంచలన విజయం సాధించిన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా ఉత్తమ జాతీయ సమగ్రతా సినిమాగా నిలిచింది.  


Also Read 'మ్యాన్షన్‌ 24' రివ్యూ : హాట్‌స్టార్‌లో ఓంకార్‌ వెబ్‌ సిరీస్‌ - భయపెట్టిందా? లేదా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial