69వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి.  ఏకంగా 10 అవార్డులు గెలుచుకుని దుమ్మురేపాయి. 2021 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యింది.  తొలి మూవీతోనే ఏకంగా నేషనల్ అవార్డు రావడం పట్ల దర్శకుడు బుచ్చిబాబు ఆనందంలో మునిగిపోయారు. కెరీర్ లో ఫస్ట్ మూవీతోనే అద్భుత ఘనతను సాధించడంతో మిత్రులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. తొలి మూవీ ఏకంగా రూ. 100 కోట్లు వసూళు చేయడంతో పాటు ఇప్పుడు జాతీయ అవార్డుకు ఎంపిక కావడంతో, సినీ ప్రముఖులు బుచ్చిబాబును అభినందించారు. ఆయన సినీ కెరీర్ మరింత ఉన్నత స్థానాలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


చిరంజీవి చెప్పిందే నిజమైంది- బుచ్చిబాబు


‘ఉప్పెన’ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చిన అనంతరం బుచ్చిబాబు మీడియాతో మాట్లాడారు. తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ఈ సినిమా కథ వినగానే చిరంజీవి జాతీయ అవార్డు వస్తుందని చెప్పారని, ఆయన అన్నట్లుగానే ఇప్పుడు అవార్డు వచ్చిందన్నారు. “ఈ సినిమాను అవార్డులను దృష్టిలో పెట్టుకుని తీయలేదు. చక్కటి కథ, అందరికీ నచ్చే కథతో రూపొందించాను. ఈ మూవీ కథ చిరంజీవి గారికి చెప్పినప్పుడు తను చాలా గొప్పగా ఉందని చెప్పారు. ఈ చిత్రానికి కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందన్నారు. మా గురువు గారు సుకుమార్ కు చెప్పినప్పుడు కూడా ఆయన ఇదే మాట చెప్పారు. ఈ రోజు వారిద్దరి మాటలు నిజం అయ్యాయి. నా తొలి చిత్రానికే జాతీయ అవార్డు లభించింది. ప్రేక్షకులు కూడా నాకు ఎంతో గౌరవాన్ని వచ్చారు. ఫస్ట్ మూవీని అద్భుతంగా ఆదరించారు. రూ. 100 కోట్లు వసూళ్లు అందించారు. ఇప్పుడు జాతీయ అవార్డు వచ్చింది. నాపై మరింత బాధ్యత పెరిగింది” అని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు. బుచ్చిబాబు, దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు. తరువాత దర్శకుడిగా మారి ‘ఉప్పెన’ సినిమాను తెరకెక్కించారు. తన మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ను అందుకున్నారు.  


10 అవార్డులు దక్కించుకున్న తెలుగు చిత్రాలు


ఇక గతంలో చెప్పుడూ లేని విధంగా ఈసారి జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రాలు దూసుకెళ్లాయి. ఏకంగా 10 అవార్డులను దక్కించుకుని ఔరా అనిపించాయి. ఆస్కార్ వేదికపై రెండు అవార్డులు దక్కించుకున్న ‘RRR’ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 6  విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై సత్తా చాటారు. ‘పుష్ప’ సినిమాలో అద్భుత నటనకు గాను ఆయన ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇప్పటి వరకు ఏ తెలుగు నటుడిగా దక్కని అరుదైన గౌరవాన్ని ఆయన దక్కించుకున్నారు.  ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దేవీ శ్రీ ప్రసాద్‌ జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారు.   ఇక ‘కొండపొలం’ చిత్రానికి గాను ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ అవార్డును సాధించారు.  మొత్తంగా ఈసారి తెలుగు చిత్రాలు జాతీయ అవార్డుల పంట పండించాయి.   


Read Also: బన్నీని విష్ చేయని చెర్రీ - ఆ ఊహాగానాలు వాస్తవమేనా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial