నవరస రాయ డా. నరేష్ విజయ కృష్ణ (Naresh VK) వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. 'మళ్ళీ పెళ్లి' విడుదలపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన మూడో భార్య రమ్యా రఘుపతి (Ramya Raghupathi) హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా ఆ సినిమా తీశారని ఆమె పేర్కొన్నారు. అసలు, వివరాల్లోకి వెళితే...


జీవితమా? చిత్రమా?
నరేష్, పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) జంటగా నటించిన సినిమా 'మళ్ళీ పెళ్లి' (Malli Pelli 2023 Movie). దీనికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. రేపు (ఈ శుక్రవారం, మే 26న) తెలుగు, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఈ తరుణంలో సినిమాను విడుదల చేయకుండా చూడాలని కోరుతూ రమ్యా రఘుపతి కోర్టుకు వెళ్లారు. దీనికి కారణం నరేష్, పవిత్ర, రమ్యల వ్యక్తిగత జీవితమే. 


'మళ్ళీ పెళ్లి' టీజర్ గానీ, ట్రైలర్ గానీ చూసిన ప్రేక్షకులు ఎవరికి అయినా సరే... ఈ సినిమాను కొత్త కథతో తీశారని అనిపించదు. ఆ మధ్య ఇటు హైదరాబాద్, అటు బెంగళూరులో జరిగిన వాస్తవ ఘటనలు, సంఘటనల స్ఫూర్తితో తీశారని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. 
రమ్యా రఘుపతిని నరేష్ మూడో వివాహం చేసుకుని, కొంత కాలం కాపురం చేసిన తర్వాత కలహాలు రావడంతో వేరు పడ్డారు. అయితే, ఇంకా విడాకులు తీసుకోలేదు. ఈ లోపు తనతో పలు చిత్రాల్లో నటించిన పవిత్రకు నరేష్ దగ్గర అయ్యారని ఫిల్మ్ నగర్ ఖబర్.


'మళ్ళీ పెళ్లి' ప్రచార చిత్రాలు చూసినా నరేష్, పవిత్ర ప్రేమను హైలైట్ చేశాయి. అయితే, పేర్లు మార్చారు! నరేష్ బదులు నరేందర్ అని పేర్కొన్నారు. ఆ ఒక్కటే కాదు... కృష్ణను సూపర్ స్టార్ అని పేర్కొన్నారు. అందువల్ల, ఈ సినిమాను కొత్త కథగా కాకుండా... నరేష్, పవిత్ర, రమ్య జీవితంలో జరిగిన గొడవల నేపథ్యంలో తీసినట్టు ఈజీగా అర్థం అవుతోంది. 'మళ్ళీ పెళ్లి'లో నరేష్ మూడో భార్య పాత్రను వనితా విజయ్ కుమార్ పోషించారు. 


ఓ విలేకరుల సమావేశంలో మీ భార్య మీద రివేంజ్ తీర్చుకోవడం కోసం సినిమా తీస్తున్నారా? అని ప్రశ్నిస్తే... కోట్లు ఖర్చుపెట్టి రివేంజ్ తీర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని నరేష్ సమాధానం ఇచ్చారు. టీజర్ వచ్చినప్పటి నుంచి దీనిపై రమ్యా రఘుపతి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని విశ్లేషకులు భావించారు. ఇప్పుడు అది నిజమైంది. మరి, కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి.  సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది చూడాలి.


Also Read : రామ్ సియా రామ్... 'ఆదిపురుష్'లో రెండో సాంగ్ రిలీజుకు భారీ ప్లాన్



జయసుధ, శరత్‌ బాబు కీలక పాత్రలు పోషిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి  స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందించారు. 


Also Read 'విరూపాక్ష'లో విలన్‌ను మార్చేసిన సుకుమార్ - ఆ యాంకర్‌కు ఛాన్స్ మిస్!