టాలీవుడ్ సీనియర్ నటుడు నాగార్జున ‘ది ఘోస్ట్‘ సినిమా తర్వాత ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోకపోవడంతో కాస్త విరామం ప్రకటించారు. తాజాగా బ్లాక్ బస్టర్ ‘ధమాకా‘ మూవీ రచయిత ప్రసన్న కుమార్ తో కలిసి ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, అల్లరి నరేష్ కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో మరో యంగ్ హీరో కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.  అతడు మరెవరో కాదు హీరో రాజ్ తరణ్. పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ కుర్ర హీరో, ఈ క్రేజీ ప్రాజెక్టులో కీ రోల్ పోషించనున్నాడు. త్వరలోనే టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


నాగార్జున కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా


‘నేను లోకల్‘, ‘హలో గురు ప్రేమకోసమే‘ ‘ధమాకా‘ లాంటి సినిమాలకు రచయితగా పని చేసి వరుస విజయాలు అందుకున్న ప్రసన్నకుమార్ నాగార్జున కోసం పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కథను సిద్ధం చేశారు. నాగార్జున కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘ది ఘోస్ట్‘ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నాగార్జున ఈ సినిమాను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించి ఫాస్ట్ గా ఫినిష్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కొంత కాలంగా తెలుగులో మల్టీస్టారర్ల సంఖ్య బాగా పెరిగింది. పలు మల్టీ స్టారర్ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున,  అల్లరి నరేష్ సినిమా సైతం మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.   


మల్టీ స్టార్ సినిమా గురించి..


నాగార్జున, అల్లరి నరేష్, ప్రసన్న కుమార్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కామెడీ  కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. 70, 80ల నాటి పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్,  స్నేహం, ప్రేమ, ప్రతీకారం లాంటి ఎలిమెంట్స్ తో నిండి ఉంటుందట. ఈ చిత్రం వచ్చే నెల రెండవ వారంలో హైదరాబాద్‌లో ప్రారంభించబడనున్నట్లు సమాచారం. హైదరాబాద్, తూర్పుగోదావరి, మైసూర్‌లో షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.   ఈ మూవీని శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. ‘భలే భలే మగాడివోయ్‘, ‘నేను లోకల్‘, ‘మహానుభావుడు‘ లాంటి  చిత్రాలను తెరకెక్కించిన నిజార్ షఫీ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు.






Read Also: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ కమెడియన్ కన్నుమూత