టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థల్లో 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' & 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓవైపు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు చిన్న మీడియం రేంజ్ చిత్రాలతో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు సూర్యదేవర నాగవంశీ. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ రూపొందుతున్నాయి. ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే యంగ్ ప్రొడ్యూసర్.. 'మ్యాడ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమాల విషయాలను, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సంగతులను పంచుకున్నారు. 


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 'గుంటూరు కారం' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సెట్స్ మీదున్న ఈ చిత్రాన్ని, వచ్చే సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ ఈ సినిమా విడుదలపై సోషల్ మీడియాలో తరచుగా ఏదొక రూమర్ ప్రచారం అవుతూనే ఉంది. దీనిపై నాగవంశీ స్పందిస్తూ మహేశ్ మూవీ కచ్చితంగా 2024 జనవరి 12వ తేదీన థియేటర్లలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. 


'గుంటూరు కారం' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, అక్టోబర్ 20వ తేదీ నాటికి టాకీ పార్ట్ పూర్తి అవుతుందని నిర్మాత తెలిపారు. ఆ తర్వాత నాలుగు పాటల చిత్రీకరణ జరుపుతామని వివరించారు. ఇప్పటికే రెండు పాటలు రెడీ అయిపోయాయని, ఫస్ట్ సింగిల్ ను 99 శాతం దసరాకు ముందే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇది ఒక మాస్ యాక్షన్ మూవీ అని, త్రివిక్రమ్ సినిమాలో ఏమేమి అంశాలు ఉండాలని ఆశిస్తారో అవన్నీ ఉంటాయన్నారు. 


చాలా రోజుల తర్వాత మహేష్ బాబుని ఒక కొత్త క్యారక్టరైజేషన్ లో, ఫుల్ ఎనర్జిటిక్ గా చూస్తారని నిర్మాత హైపెక్కించారు. ఇది ఫ్యాన్స్ కి పెద్ద పండుగలా ఉంటుందని, మహేశ్ - శ్రీలీల కలయికలో ఒక మంచి డ్యాన్స్ నంబర్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. సినిమా సంక్రాంతికి రాదనే డౌటే లేదని, 200 శాతం ఆ డేట్ మిస్ అయ్యే సమస్యే లేదని అన్నారు. 'గుంటూరు కారం' టాలీవుడ్ లో నాన్ రాజమౌళి సినిమా రికార్డ్ సెట్ చేస్తుందని నాగవంశీ ధీమా వ్యక్తం చేసారు. నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దిల్ రాజు హయ్యెస్ట్ రేటుకు కొన్నారని తెలిపారు.  


Also Read: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'


'టిల్లు స్క్వేర్' ఎప్పుడు రిలీజైనా బ్లాక్ బస్టర్ అవ్వాలనే విధంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నాగవంశీ చెప్పారు. ఇప్పుడు ఇండస్ట్రీలో విడుదల తేదీలపై క్లారిటీ లేదని, మొన్న సడన్ గా ఒక పెద్ద బొమ్మ రిలీజ్ డేట్ ఇవ్వడంతో మొత్తం చిందర వందర అయిపోయిందని అన్నారు. కానీ ఎప్పుడొచ్చినా 'టిల్లు'ని సోలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోయే నాలుగో సినిమా గురించి మాట్లాడుతూ.. తాము అనుకున్న ప్లాన్ ప్రకారమైతే 'పుష్ప 2' తర్వాత బన్నీ ప్రాజెక్ట్ ఇదేనని నిర్మాత అన్నారు. 


Also Read 'కన్నూర్ స్క్వాడ్' రివ్యూ : మమ్ముట్టి కొత్త సినిమా ఎలా ఉంది - కార్తీ మూవీనే మళ్లీ తీశారా?


'గుంటూరు కారం' ప్లాన్ చేసినప్పుడే అది పాన్ ఇండియా సినిమా కాదని క్లియర్ గా ఉన్నామని చెప్పారు. ముందు నుంచీ బన్నీ సినిమాతోనే త్రివిక్రమ్ పాన్ ఇండియా స్కేల్ కు వెళ్లాలనే ఐడియాతో ఉన్నారని.. అదే ఆయనకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అవుతుందన్నారు. ఆ సినిమా ఇప్పటి వరకూ దర్శకుడు టచ్ చేయని జోనర్ లో ఉంటుందని, భారీ స్థాయిలో తెరకెక్కిస్తామని వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబోలో రూపొందే సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని వెల్లడించారు. ఇప్పటి వరకూ చూడని విధంగా బాలయ్యని చూస్తారని, ముఖ్యంగా సెకండాఫ్ లో 40 నిమిషాల పోర్షన్ ఎక్ట్రార్డినరీగా ఉంటుందని చెప్పుకొచ్చారు.


బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి పోటీగా దసరా సీజన్ లో 'లియో' వంటి డబ్బింగ్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడమైనా నాగవంశీ స్పందించారు. తాను కాకపోతే ఎవరో ఒకరు తెలుగులోకి తీసుకొస్తారని, లియోని తను రిలీజ్ చెయ్యడమే బాలయ్య సినిమాకు కంఫర్టబుల్ అని, థియేటర్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చని అన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక మైథలాజికల్ ప్రాజెక్ట్ ప్రాసెస్ లో ఉందని ప్రొడ్యూసర్ తెలిపారు. ప్రశాంత్ నీల్ తో తారక్ చేయబోయే సినిమాని బట్టి తమ చిత్రాన్ని ప్లాన్ చేస్తామని చెప్పుకొచ్చారు. 


సితార బ్యానర్ లో విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమా గురించి కూడా వంశీ మాట్లాడారు. 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ అవుతోందని, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మీద నమ్మకంతో భారీ స్కేల్ లో తీస్తున్నామని, తనదైన రోజు విజయ్ ఒక సినిమాని ఏ రేంజ్ కైనా తీసుకెళ్లగలడని అన్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రీలీలను తప్పించి రష్మిక మందన్నని తీసుకున్నారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసారు. నవంబర్ లో తదుపరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. 


Also Read: ‘భగవంత్ కేసరి’ నుంచి బాలయ్య, శ్రీలీలాల సాంగ్ వచ్చేసింది!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial