ప్రముఖ సినీ హీరో నాగశౌర్య షూటింగ్‌లో సొమ్మసిల్లి పడిపోయారు. గత మూడు రోజుల నుంచి మంచి నీరు తాగకుండా ‘నో వాటర్ డైట్’లో నాగశౌర్య ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఒక ఆస్పత్రిలో నాగ శౌర్యకు చికిత్స కొనసాగుతున్నట్టుగా సమాచారం. అయితే ప్రమాదమేమీ లేదని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.


నాగశౌర్యకు ఇటీవలే పెళ్లి కూడా కుదిరింది. మరో ఆరు రోజుల్లో నవంబర్ 20వ తేదీన బెంగళూరులో జరగనుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యపరమైన సమస్యలు రావడం దురదృష్టకరం. విఠల్ మాల్య రోడ్డులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో ఈ పెళ్ళి జరగనుంది. ఆదివారం (నవంబర్ 20వ తేదీ) ఉదయం 11.25 గంటలకు అనూషతో నాగశౌర్య పెళ్లి జరగనుంది. పెళ్లి పనులు ఇప్పటికే మొదలయ్యాయి. పెళ్లి శుభలేఖలు కూడా పంచడం మొదలైపోయింది. పెళ్ళికి వచ్చేశారు భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా నాగశౌర్య ఫ్యామిలీ కోరుతోంది. పెళ్ళికి ముందు రోజు మెహందీ ఫంక్షన్ కూడా ఉంటుందని తెలిసింది. ఈ విషయం తెలిసిన అనంతరం నాగశౌర్యకు అభిమానులు, ప్రేక్షకులు శుభాకాంక్షలు చెబుతున్నారు.


'కృష్ణ వ్రింద విహారి'తో సెప్టెంబర్ 23వ తేదీన నాగశౌర్య థియేటర్లలోకి వచ్చారు. అందులో కట్టుబాట్లు, పద్ధతి, పడికట్లకు విలువ ఇచ్చే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన యువకుడిగా నాగశౌర్య కనిపించారు. మోడ్రన్ అమ్మాయితో ప్రేమలో పడిన హీరో పెళ్లి తర్వాత తల్లికి, భార్యకు మధ్య నలిగిపోయే పాత్రలో నటించారు. పెళ్లి నేపథ్యంలో సినిమా చేసిన వెంటనే ఆయన వివాహానికి రెడీ అవుతుండటం విశేషం.
 
'కృష్ణ వ్రింద విహారి' విడుదల సమయంలోనే నాగశౌర్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఆ సినిమాకు ఆయన తల్లి ఉషా ముల్పూరి నిర్మాత. సినిమా విడుదలకు ముందు అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడుతూ ''ఈ తరం యువతకు పెళ్లి విషయంలో స్పష్టత ఉంది. అబ్బాయి పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది. అయినా ఈ కాలం పిల్లల మాట వింటారా?'' అని అన్నారు. త్వరలో పెళ్లి ఉంటుందని హింట్ ఇచ్చారు.