కింగ్ అక్కినేని నాగార్జునకు తెలుగు చిత్రసీమలో ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. వారిలో యువ దర్శకుడు చందూ మొండేటి ఒకరు. అక్కినేని హీరోల మీద తన అభిమానాన్ని పలు సందర్భాల్లో ఆయన చాటుకున్నారు. ఆల్రెడీ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)తో ఓ సినిమా చేశారు. ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.


గీతా ఆర్ట్స్ సంస్థలో చైతూ, చందు సినిమా
అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటు ఉంది. ఓ కథానాయికగా కీర్తీ సురేష్ (Keerthy Suresh), మరో నాయికగా అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) పేరును చందూ మొండేటి పరిశీలిస్తున్నారట. 


ఇప్పటి వరకు చైతూ, కీర్తీ సురేష్ కలిసి నటించలేదు. ఒకవేళ ఓకే అయితే... వాళ్ళ కలయికలో ఇది తొలి సినిమా అవుతుంది. ఆల్రెడీ చైతూ, చందూతో 'ప్రేమమ్' చేశారు అనుపమ. 


చైతూతో దర్శక, నిర్మాతలది హిట్ రికార్డ్! 
అక్కినేని నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇటు దర్శకుడు కూడా చైతూతో హిట్ సినిమా తీశారు. 'కార్తికేయ'తో దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటికి ఆ వెంటనే అక్కినేని హీరో నాగ చైతన్యతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. మలయాళ క్లాసిక్ 'ప్రేమమ్'ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. అయితే... ఆ తర్వాత సొంత కథతో  నాగ చైతన్యతో చేసిన స్ట్రెయిట్ తెలుగు సినిమా 'సవ్యసాచి' ఆశించిన విజయం అందుకోలేదు.


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే


ఇప్పుడు చందూ మొండేటి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. 'కార్తికేయ 2' దర్శకుడిగా ఆయనకు ఉత్తరాదిలో మంచి గుర్తింపు వచ్చింది. నాగ చైతన్య కూడా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని ట్రై చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' చేశారు. కానీ, అది హిట్ కాలేదు. అందులో చైతూ పాత్రకు మంచి పేరు కూడా రాలేదు. 'కస్టడీ'తో తమిళంలో హిట్ అందుకోవాలని ఆశించినా కుదరలేదు. చందూ మొండేటితో చేసే సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం.  


గీతా ఆర్ట్స్ సంస్థలో 'త్రీ'డీకి చందూ రెడీ!
నాగ చైతన్య సినిమా మాత్రమే కాదు... ఆ తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలో రెండు సినిమాలు చేయనున్నారు చందూ మొండేటి. మొత్తం మీద ఆయనతో మూడు సినిమాలు చేయడానికి గీతా ఆర్ట్స్ రెడీ అవుతోంది. ఇటీవల అల్లు అరవింద్ కూడా ఓ వేదిక మీద ఆ మాట చెప్పారు. 


నాగార్జునతో చందూ మొండేటి పోలీస్ సినిమా!?
నాగ చైతన్యతో సినిమా ఓకే కావడానికి ముందు నాగార్జున కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరిగాయి. స్వయంగా చందూ మొండేటి 'కార్తికేయ 2' (Karthikeya 2 Movie) ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ''నేను నాగార్జున గారికి ఒక పోలీస్ కథ చెప్పాను. అది ఆయనకు నచ్చింది.  మేం ఇద్దరం కలిసి త్వరలో ఒక సినిమా చేయబోతున్నాం'' అని పేర్కొన్నారు.


Also Read : పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్'లో ఛాన్స్ కొట్టేసిన 'ఏజెంట్' బ్యూటీ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial