Naa Saami Ranga : టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున చివరగా 'ఘోస్ట్' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. దాంతో తన కొత్త ప్రాజెక్ట్ కోసం నాగ్ ఏకంగా ఏడాదికి పైగా టైం తీసుకున్నాడు. ఎట్టకేలకు 'నా సామిరంగా' అనే సినిమాని ప్రకటించాడు. చాలాకాలం తర్వాత నాగార్జున నటిస్తున్న పూర్తి స్థాయి మాస్ మూవీ ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, గ్లిమ్స్, ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో వరలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయిగా ఆశిక రంగనాథ్ కనిపించనుంది.


ఈ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసిన మూవీ టీం తాజాగా ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ రివిల్ చేసింది. ఈ మూవీలో మరో హీరో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మూవీ టీం తాజాగా పోస్టర్ ద్వారా తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. "మా అంజి గాడ్ని పరిచయం చేస్తున్నాం. లేదంటే మాటొచ్చెతది" అంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా అంజి గాడికి సంబంధించిన స్పెషల్ ఇంట్రో ప్రోమోని రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.






ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో అల్లరి నరేష్ తనదైన మాస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఈ అప్డేట్ తో సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ కూడా ఉన్నాడనే విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంటే 'నా సామిరంగా' మల్టీ స్టారర్ ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు వస్తోందన్నమాట. ఇందులో అల్లరి నరేష్ రోల్ సినిమా అంతా ఉంటుందా? లేక క్యామియో మాత్రమేనా? అనేది తెలియాల్సి ఉంది. నిజానికి ఈ సినిమాని అనౌన్స్ చేయడానికి ముందే నాగార్జున, అల్లరి నరేష్ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారని, వీళ్ళిద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ రాబోతుందని.. కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిపై మూవీ టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇది నిజం కాదేమో అని అంతా అనుకున్నారు.


కానీ తాజాగా ఈ విషయం నిజమేనని ‘నా సామిరంగా’ మూవీ టీం కన్ఫర్మ్ చేసింది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే పాట మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ పాట చూస్తే హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్ సినిమాకి హైలెట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.


Also Read : 'బిగ్ బాస్ 7' ఫినాలేకి గెస్ట్‌గా ఆ స్టార్ హీరో - ఇదే ఫస్ట్ టైమ్, ఫ్యాన్స్ పండగే!