ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. భారతీయ సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ - 2023 లో ఈసారి 'తెలుగు సినిమాలు' సత్తా చాటాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' ఏకంగా మూడు జాతీయ అవార్డులని అందుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీ నిర్మాతలు న‌వీన్ ఎర్నేని, వై ర‌విశంక‌ర్ లు శనివారం రాత్రి నేషనల్ ఫిలిం అవార్డుల విన్నర్స్ కోసం హైదరాబాద్ గండిపేటలో గ్రాండ్ గా పార్టీ నిర్వహించారు.


2021 సంవత్సరంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రంలో అద్భుతమైన నటనకు‌గానూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సొంతం చేసుకున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డ్‌ ని స్వీకరించారు. అలానే అదే బ్యానర్ రూపొందిన ‘ఉప్పెన’ సినిమా జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డ్‌ కైవశం చేసుకుంది. ఒకే నిర్మాణ సంస్థకు మూడు పురష్కారాలు ద‌క్క‌డం అన్నది గొప్ప విషయం. ఈ ఆనందాన్ని ఎంతో వైభ‌వంగా సెల‌బ్రేట్ చేయాల‌ని ప్లాన్ చేసిన మైత్రీ మేకర్స్.. జాతీయ అవార్డు విజేతలను ప్రత్యేకంగా సన్మానించారు. 






మైత్రీ పార్టీకి అల్లు అర్జున్ - దేవిశ్రీ ప్రసాద్ - ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబులతో పాటుగా నేషనల్ ఫిలిం అవార్డ్స్ అందుకున్న కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కూడా పాల్గొన్నారు. నటుడు ప్రకాష్ రాజ్, దర్శకులు కొరటాల శివ, హరీష్ శంకర్, మారుతి, గోపీచంద్ మలినేని, బాబీ కొల్లు, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేస్తూ ''తెలుగు సినిమాకు గర్వకారణమైన జాతీయ అవార్డు గ్రహీతలను సన్మానించడం గౌరవంగా భావిస్తున్నాం. టాలీవుడ్ నేషనల్ అవార్డ్ విన్నర్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం'' అని పేర్కొన్నారు. 


నేషనల్ అవార్డ్ విన్నర్స్ సెలబ్రేషన్స్​లో భాగంగా అవార్డు గ్రహీతలతో కేట్ కట్ చేయించి అభినందనలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇందులో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో ఉన్న అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మైత్రీ నిర్మాతలను ఇండస్ట్రీకి తీసుకొచ్చిన దర్శకుడు కొరటాల శివ కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.






మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. అమెరికాలో పంపిణీదారులుగా ఉన్న న‌వీన్ ఎర్నేని, వై ర‌విశంక‌ర్.. 'శ్రీమంతుడు' సినిమాతో నిర్మాణంలో అడుగుపెట్టారు. వరుస సినిమాలు, బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్నారు. ఓవైపు భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే మరోవైపు అవార్డు విన్నింగ్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు రూపొందిస్తూ మంచి అభిరుచి గల నిర్మాతలు అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' వంటి పాన్ ఇండియా మూవీతో పాటుగా పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నిర్మిస్తున్నారు. మలయాళ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇస్తున్న మైత్రీ ప్రొడ్యూసర్స్, త్వరలో బాలీవుడ్​లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.


Also Read: హాస్పిటల్ బెడ్​పై స్టార్ హీరోయిన్.. షాక్​లో ఫ్యాన్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial