The Greatest Of All Time: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ తెలుగు హక్కులను టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.


'ది గోట్' మూవీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాదాపు రూ. 30 కోట్లకు తెలుగు హక్కులు కొనుగోలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకముందు విజయ్ నటించిన 'లియో' తెలుగు రైట్స్ 21 కోట్లకు అమ్ముడైతే.. 'బీస్ట్' మూవీ హక్కులు 10 కోట్ల వరకూ పలికాయి. 'మాస్టర్' సినిమాని దగ్గర దగ్గర 8 కోట్లు చెల్లించి తీసుకున్నారు.






'ది గోట్' సినిమాని సెప్టెంబర్ లో విడుదల చేస్తామని చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మైత్రీ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తుందని ప్రకటించారు. అయితే ఇంతలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న 'లక్కీ భాస్కర్' సినిమాని సెప్టెంబర్ 7వ తేదీన పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీన్ని బట్టి బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాల మధ్య గట్టి పోటీ ఏర్పడేలా కనిపిస్తోంది. 


'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అనేది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ. ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, ప్రశాంత్‌, లైలా, యోగిబాబు, జయరాం, వైభవ్, అజ్మల్ అమీర్, మోహన్, ప్రేమ్జీ అమరన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. వెంకట్ రాజన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.


విజయ్ కెరీర్ లో 68వ చిత్రం 'ది గోట్'. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, విజయ్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండు పాటలకు కూడా మంచి స్పందన లభించింది. ఇక ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను మైత్రీ మూవీ మేకర్స్  సొంతం చేసుకోవడంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్ధాయిలో విడుదల చేయడం గ్యారంటీ అని తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.


ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రస్తుతం అజిత్ కుమార్ హీరోగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే తమిళ సినిమా రూపొందుతోంది. అలానే అల్లు అర్జున్ తో 'పుష్ప 2'.. రామ్ చరణ్ తో RC 16.. ఎన్టీఆర్ హీరోగా 'డ్రాగన్' చిత్రాలను నిర్మిస్తున్నారు. నితిన్ 'రాబిన్ హుడ్', విజయ్ దేవరకొండ 'VD 14' సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇటీవలే సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబోలో ఓ హిందీ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా లాంఛ్ చేశారు.


Also Read: 'లక్కీ భాస్కర్' రిలీజ్ డేట్ ఫిక్స్ - దుల్కర్ సల్మాన్ సినిమా వచ్చేది ఎప్పుడంటే?