ఈ ఏడాది ప్రారంభంలో మాస్ మహారాజా రవితేజతో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ జోష్ లో ప్రస్తుతం తన తమ్ముడు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది. 2023 ఆగస్టు 11న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు డేట్ కూడా ఇచ్చేసారు. అయితే దీని తరువాత చిరు చేయబోయే సినిమాపై ఇప్పటి వరకూ ప్రకటన చేయలేదు.

 

నిజానికి 'భీష్మ' ఫేమ్ వెంకీ కుడుములతో చిరంజీవి ఓ సినిమా కమిట్ అయ్యారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ సెట్స్ మీదకు తీసుకెళ్ళకుండానే ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేసారు. దర్శకుడు వెంకీ సైతం యువ హీరో నితిన్, రష్మిక మందన్నాల కాంబినేషన్ లో మరో మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో చిరు నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారనే డిస్కషన్ జరుగుతున్న తరుణంలో, మెగాస్టార్ ఇద్దరు ముగ్గురు టాలెంటెడ్ డైరెక్టర్లను లైన్ లో పెట్టారనే టాక్ వినిపిస్తోంది.

 

సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం, బంగార్రాజు వంటి హిట్ చిత్రాల దర్శకుడు కల్యాణ్ కృష్ణతో చిరంజీవి వర్క్ చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ఫిలిం సర్కిల్స్ లో వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే మనకందిన సమాచారం ప్రకారం కల్యాణ్ చెప్పిన కథకు చిరు పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది. ఇదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ అని, వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ నుంచి మళ్లీ అలాంటి నవ్వులు పూయిస్తుందని అంటున్నారు. 

 

'నేను లోకల్', 'ధమాకా' చిత్రాల రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ అందించనున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోందని.. ఇదే మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పుకుంటున్నారు. ఇందులో ఓ యంగ్ పెయిర్ పాత్రలకు ప్రాధాన్యం ఉందని, ఆ క్యారెక్టర్స్ కోసం 'డీజే టిల్లు' సిద్దూ జొన్నలగడ్డ, శ్రీలీల పరిశీలనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ లో మెగా డాటర్ సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే #Mega156 ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

 

మరోవైపు డైరెక్టర్ వశిష్ట మల్లిడితో ఓ సినిమా చేయడానికి చిరంజీవి అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. 'బింబిసార' తో బ్లాక్ బస్టర్ అందుకున్న వశిష్ట, మెగాస్టార్ కోసం ఓ యాక్షన్ అడ్వెంచర్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు టాక్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కల్యాణ్ కృష్ణ మూవీతో పాటు సమాంతరంగా ఈ సినిమా షూటింగ్ జరిపేలా ప్లాన్ చేస్తున్నారని అనుకుంటున్నారు.

 

ఇకపోతే తమిళ దర్శకుడు పిఎస్ మిత్రన్ కూడా చిరు కి కథ చెప్పినట్లు వినిపిస్తోంది. అభిమన్యుడు, హీరో, సర్దార్ వంటి వైవిధ్యమైన సినిమాలలో మెప్పించిన మిత్రన్.. మెగాస్టార్ కోసం అలాంటి స్టోరీనే నెరేట్ చేసినట్లుగా చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద చిరంజీవి స్టార్ డైరెక్టర్స్ తో కాకుండా కొత్త కాంబినేషన్స్ లో సినిమాలు చేయటానికి ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం భోళా శంకర్ షూటింగ్ తో బిజీగా ఉన్న మెగాస్టార్.. త్వరలోనే తన తదుపరి చిత్రాలపై స్పష్టత ఇస్తారేమో చూడాలి.