Chiranjeevi: భారత ప్రభుత్వం ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి 'ప‌ద్మ‌విభూష‌ణ్' అవార్డ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారానికి చిరు ఎంపిక కావడంతో, సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ వ్యక్తులు, అభిమాన సంఘాలు ఆయన్ను సత్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలోని మెగా ఫ్యాన్స్ నుంచి ఆయనకు ఘన సత్కారం లభించింది.


ప్రస్తుతం యూఎస్ఏ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చిరంజీవికి ఘన‌మైన స్వాగ‌తం ల‌భించింది. లాస్‌ ఏంజిల్స్‌లోని మెగా అభిమానులు ఆదివారం `మెగా ఫెలిసిటేషన్‌ ఈవెంట్‌` ను నిర్వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ వేడుకలో, చిరుని ఘనంగా సత్కరించారు. పుష్ప గుచ్చాలు అందించి శాలువాలతో స‌న్మానించారు. 


ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. పద్మవిభూషణ్ అవార్డు వరించినందుకు ఎంతో ఆనందంగా వుంది. ఈ విష‌యంలో నాక‌న్నా ఎక్కువ‌గా అభిమానులే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఎంతో ప్రేమ చూపిస్తూ, ఇంతలా ఆదరిస్తున్న వాందరికీ ధన్యవాదాలు. మీ నుంచి వచ్చే ఈ ప్రశంసలే నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. ఇదే నాకు అసలైన అవార్డ్. ఇంతకు మించిన అవార్డ్ ఇంకేం ఉంటుంది అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






పద్మభూషణ్ అవార్డ్ ప్రకటించిన తర్వాత, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రపున చిరంజీవిని సత్కరించిన సంగతి తెలిసిందే. అలానే టాలీవుడ్ ఇండస్ట్రీ తరపున మెగాస్టార్ ని ఘ‌నంగా సత్క‌రించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న అందించిన సేవ‌ల్ని మ‌రోసారి గుర్తు చేసుకుంటూ, ఇండస్ట్రీకి ఇంతటి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన చిరుని సత్కరించాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ ఈవెంట్ లో మెగా ఫ్యామిలీ హీరోలతో పాటుగా ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు పాల్గొనే అవకాశం ఉంది. ఇక రాజమండ్రిలో అత్యంత వైభవంగా 'పద్మవిభూషణుడి మెగా సంబరాలు' చేయటానికి మెగా ఫ్యాన్స్ సన్నాహాలు చేస్తున్నారు.






ఇక సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమాలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే చిరు సెట్స్ లో అడుగుపెట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ లో జరిగిన ఈ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరించారని సమాచారం. షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న చిరు.. తన సతీమణి సురేఖ కొణిదెలతో కలిసి హాలిడేకి వెళ్ళారు.


'విశ్వంభర' పంచభూతాల కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ఇందులో యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. దీని కోసం 13 భారీ సెట్లు నిర్మించినట్లుగా టాక్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.


Also Read: 'రాయన్'గా ధనుష్, గుండుతో ఫస్ట్ లుక్ అదుర్స్!