Shyam Prasad Reddy Wife M Varalxmi No More: తెలుగు సినిమా పరిశ్రమలో మరో విషాదం జరిగింది. ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైన్స్‌ మెంట్‌ అధినేత శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి, దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుమార్తె వరలక్ష్మి చనిపోయారు. ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పరిస్థితి విషమించి బుధవారం(ఆగష్టు 7న) రాత్రి సమయంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 62 సంవత్సరాలు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వరలక్ష్మీ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారిలో ఒకరు దీప్తి కాగా, మరొకరు మైత్రి.  ఆమె మృతి వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె పార్థివదేహాన్ని దర్శించుకుని నివాళులర్పించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డిని కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


జూబ్లీహిల్స్‌  మహాప్రస్థానంలో వరలక్ష్మి అంతిమ సంస్కారాలు


ఇవాళ (ఆగష్టు 8) సాయంత్రం సమయంలో జూబ్లీహిల్స్‌ లోని మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు వరలక్ష్మి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బంధుమిత్రులు ఆశృ నయనాలతో ఆమెకు అంతిమ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.  


పలు ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి


ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1987లో ఎంఎస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ‘తలంబ్రాలు’ చిత్రంతో నిర్మాతగా టాలీవుడ్‌ లోకి అడుగు పెట్టారు. 1992 లో మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఈ బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మించారు. ఆయన బ్యానర్ లో ‘అమ్మోరు’, ‘అంజి’, ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’, ‘అరుంధతి’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలు తెరకెక్కాయి.


టీవీ షోలు, సీరియల్స్ నిర్మిస్తున్న మల్లెమాల సంస్థ


గత కొంతకాలంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. టీవీ షోలు ఎక్కువగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ లో ‘జబర్దస్త్‌’, ‘ఢీ’ లాంటి పలు సూపర్‌ హిట్‌ టీవీ షోలు, సీరియల్స్ నిర్మిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ‘జబర్దస్త్’ కామెడీ షో తెలుగు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకులను ఓరేంజిలో ఆకట్టుకుంటున్నాయి.  ప్రస్తుతం యాంకర్ సుమ హోస్టుగా చేస్తున్న ‘సుమ అడ్డా’ కూడా మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణంలోనే కొనసాగుతోంది. శ్యామ్ ప్రసాద్రెడ్డి నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన కామెడీ షోలు బుల్లితెరపై మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి.  


Read Also: రూ.500 అప్పు చేశా, చచ్చిపోతానని బెదిరించాకే అమ్మ అందుకు ఒప్పుకుంది - ‘జబర్దస్త్’ ఫైమ



Read Also: భారతీయుడు గెటప్‌లో కార్తీక్... సైలెంట్ స్కిట్‌తో నవ్వించిన రాఘవ... ‘జబర్దస్త్’ ప్రోమో