కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్'(jawan) మూవీ విజయం పట్ల తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మూవీ టీం ని కంగ్రాచ్యులేట్ చేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గౌరీ ఖాన్ సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన 'జవాన్' మూవీ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. షారుఖ్, నయనతార జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది. 'పఠాన్' తర్వాత షారుఖ్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల సినిమాగా నిలిచింది.


రీసెంట్ గానే జవాన్ రూ.1000 కోట్ల మార్క్ ని అందుకున్న విషయం తెలిసిందే. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్నిచోట్ల కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీస్ సైతం జవాన్ పై ప్రశంసలు కురిపించారు. సినిమాలో డ్యూయల్ రోల్‌లో షారుక్ స్వాగ్, స్టైల్, యాక్షన్.. ఇలా అన్నిటికీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కాగా ఇప్పటివరకు ఏ సినిమా గురించి మాట్లాడని ఓ స్టార్ హీరో జవాన్ పై మొదటిసారి ప్రశంసలు కురిపించాడు. ఆయన మరెవరో కాదు దళపతి విజయ్.






సోషల్ మీడియాలో ఏమాత్రం యాక్టివ్ గా ఉండని విజయ్ ఇప్పటివరకు ఓ సినిమా గురించి కానీ ఓ హీరో గురించి కానీ ప్రత్యేకంగా ట్విట్టర్ వేదికగా చెప్పడం జరగలేదు. కానీ మొట్టమొదటిసారి 'జవాన్' సినిమాపై స్పందిస్తూ పలు ఆసక్తికర ట్వీట్స్ చేశారు. జవాన్ రిలీజ్ అయిన దగ్గరనుంచి ట్విట్టర్లో సినిమా చూసి ప్రశంశలు కురిపిస్తున్న వారందరికీ షారుక్ ఓపిగ్గా సమాధానం ఇస్తూ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా దళపతి విజయ్ ఫ్యాన్స్ 'జవాన్' సినిమా రూ.1000 కోట్లు సాధించడంతో శుభాకాంక్షలు తెలిపారు. దీనికి షారుక్ రిప్లై ఇస్తూ.. "మీ విషెస్ కు థాంక్యూ. దళపతి తదుపరి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐ లవ్ విజయ్ సర్" అంటూ రాస్కొచ్చాడు.


ఇక ఈ ట్వీట్ కి స్వయంగా దళపతి విజయ్ రిప్లై ఇస్తూ.. "బ్లాక్ బస్టర్ సాధించినందుకు అభినందనలు. అట్లీ, షారుక్ సార్ మరియు చిత్ర బృందానికి.. లవ్ యు టూ షారుక్ సార్" అంటూ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ చూసి షారుఖ్ ఖాన్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో విజయ్ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దళపతి విజయ్ ప్రస్తుతం 'లియో' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.


లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా.. సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక షారుఖ్ ఖాన్ విషయానికొస్తే, 'జవాన్' సక్సెస్ తర్వాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' అనే సినిమా చేస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : ‘యానిమల్’ టీజర్: నాకన్నా చెడ్డవాడు లేడు - రణ్ బీర్ ఊరమాస్ అవతార్ అదుర్స్!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial