Surekha About Mega Brothers Food Habits: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని తెలుగు ప్రజలు లేరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన ప్రయాణం కొనసాగుతోంది. ఎన్నో అద్భుత చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కుర్ర హీరోలకు ధీటుగా వరుస సినిమాలతో కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఆయన సతీమణి సురేఖ కూడా అందరికీ బాగా తెలుసు. చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగేందుకు ఆమె వెనుకుండి ముందుకు నడిపించారు. తాజాగా ఆమె కోడలు ఉపాసన సహకారంతో అత్తమ్మ కిచెన్ ను ప్రారంభించారు. సురేఖ కొణిదెల బర్త్ డే సందర్భంగా కొత్త బిజినెస్ ను లాంచ్ చేశారు. మెగా ఇంటి వంటలను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇన్ స్టంట్ గా తయారు చేసుకుని పలు రకాల ఫుడ్ ఐటెమ్స్ ను అమ్ముతున్నారు. విదేశాల్లోనూ పులిహోర, రసం, ఉప్మా లాంటివి ఇన్‌స్టంట్‌గా చేసుకోడానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంచారు. 


చిరంజీవి, పవన్ కల్యాణ్ అలా.. నాగబాబు ఇలా..  


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేఖ… మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవి భోజనం విషయంలో అస్సలు ఆలోచించరని చెప్పారు. రకరకాల రుచులు కోరుకోరని.. ఏది పెట్టినా తింటారని చెప్పారు. కూరలు లేకుండా చివరకు పచ్చడితో పెట్టిన చక్కగా భోజనం చేస్తారని చెప్పారు. కూర ఏదైనా కడుపు నిండా తింటారని వెల్లడించారు. చిరంజీవి చిన్న సోదరుడు పవన్ కల్యాణ్ కూడా అన్నయ్య మాదిరగానే ఉంటారని చెప్పారు. ఏది పెట్టినా వంకపెట్టకుండా తింటారని చెప్పారు. కానీ, నాగబాబు వ్యవహారం వీరిద్దరికి పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఆయన భోజనం చేయాలంటే రుచులు కోరుకుంటారని వివరించారు. రకరకాల వంటకాలు ఉంటేనే ఆయనకు నచ్చుతుందని చెప్పారు. అంతేకాదు, తన మామగారు చక్కగా భోజనం చేసే వారని చెప్పారు. ఆయనలా  తినడం ఓ కళ అని, అలా తినే వాళ్లు భోజనం పెట్టడం సంతృప్తిని కలిగిస్తుందన్నారు.   


నాకు వంటలు నేర్పించిన గురువు మా ఆయనే!


నిజానికి తమ ఇంట్లో చిన్నదాన్ని కావడంతో గారాబంగా పెంచారని సురేఖ చెప్పారు. పెళ్లి తర్వాతే వంట నేర్చుకున్నట్లు వెల్లడించారు. వంట చేయడంలో తనకు చిరంజీవి గురువు అని చెప్పుకొచ్చారు. పెళ్లైన కొత్తలో తాను ఉప్మా చేస్తే ఉండలు ఉండలుగా వచ్చిందని, ఎవరూ సరిగా తినలేకపోయారని చెప్పారు. కానీ, ఇప్పుడు అడిగి మరీ తింటారని చెప్పారు.  ఒకప్పుడు వంటలు చేయడం రాని నాకు, ఇప్పుడు చక్కగా వంట చేయడం వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సురేఖ, మెగా బ్రదర్స్ ఆహారపు అలవాట్ల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  






Read Also:  హీరోయిన్ సాయి పల్లవిపై ఆర్బీఐ కేసు - ఇదీ అసలు విషయం!