'ది కాశ్మీర్ ఫైల్స్'తో బ్లాక్ బాస్టర్ అందుకున్న బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ఫిలిం మేకర్స్, యాక్టర్స్ పై బహిరంగంగా ఈయన చేసిన కామెంట్స్ ఎంతో హాట్ టాపిక్ అయ్యాయి. టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ (Prabhas), 'ఆదిపురుష్'పై నెగిటివ్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar), అగ్ర హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)లను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.


వివేక్ అగ్నిహోత్రి తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ... ఒకప్పటి కంటే ఇప్పుడు తనలో చాలా మార్పు వచ్చిందని, అది తన భావజాలాన్ని, సినిమా పట్ల ఉన్న విధానాన్ని మార్చిందని అన్నారు. చాలా సంవత్సరాలుగా తనను తాను వామపక్షవాదిగా భావించుకున్న వివేక్ అగ్నిహోత్రి కొన్ని సంవత్సరాల నుంచి మితవాద రాజకీయ అభిప్రాయాల గురించి గళం విప్పుతూ పలుమార్లు ట్రోల్స్ కి గురవుతున్నారు. అయితే తన పాత ట్వీట్లను తవ్వి తీసి, తనను ఎంత ట్రోల్ చేసినా తాను ఏమాత్రం బాధపడనని అన్నారు. తనను ట్రోల్ చేసే వాళ్లకు చాక్లెట్ ప్యాకెట్లు పంపించి వాళ్లకు థాంక్స్ చెప్పదలుచుకొన్నట్లు పేర్కొన్నారు. ఎందుకంటే వాళ్ల ట్రోల్స్ వల్లే తాను మారాననే విషయాన్ని గుర్తించానని ఆయన పేర్కొన్నారు.


"ఢిల్లీ ఫైల్స్' కోసం మీరు నన్ను 2024 లేదా 2025లో కలిసినప్పుడు అప్పటికి నేను అవే మాటలు మాట్లాడుతుంటే నా గురించి నేను సిగ్గుపడాలి. నేను ప్రతి రోజు మారని జీవితాన్ని గడపలేను. ప్రతి రోజు మారిన విషయాలతో ఓ కొత్త రోజు స్టార్ట్ అవుతుంది. అలా జీవించాలని అనుకుంటాను. కానీ, నిశ్చల జీవితాన్ని గడపాలని అస్సలు అనుకోను. అంతే కాకుండా అనుభవం, వయసుతో సినిమా పట్ల తన దృక్పథం కూడా చాలా మారింద''ని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు. ''ఒక ఫిలిం మేకర్ గా భారతదేశం అంతటా పర్యటించి దేశాన్ని చూడడం ఇదే తొలిసారి. ఈ సమయంలో ఎవరూ చెప్పని కథలు చాలా ఉన్నాయని నేను గ్రహించాను. అది అతి పెద్ద నేరంగా నేను భావిస్తున్నాను" అని ఆయన అన్నారు.


కరణ్ జోహార్, షారుక్ ఖాన్ సినిమా భారత దేశ సాంస్కృతిక విలువలను దెబ్బ తీసిందని, అది కూడా చాలా విధ్వంసకర రీతిలో ఉందని వివేక్ అగ్నిహోత్రి చెప్పారు. అందుకు అమితాబచ్చన్ సినిమాను ఉదాహరణగా వివరిస్తూ... ''ప్రస్తుతం నిజమైన, నిజాయితీ గల కథలను జనాలకు చెప్పడం ఎంతో అవసర‌ం. కానీ, ఇది అమితాబ్ బచ్చన్ 'షాహిన్షా' తర్వాత ఆగిపోయింది" అని వివేక్ అగ్నిహోత్రి చెప్పుకొచ్చారు. దీంతో షారుక్ ఖాన్, కరణ్ జోహార్లపై వివేక్ అగ్నిహోత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. కాగా వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'ది వ్యాక్సిన్ వార్' సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సలార్' తో ఈ సినిమా పోటీ పడనుంది. 'సలార్' కూడా అదేరోజు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.


Also Read : సిల్క్ స్మితకి అసలు డ్యాన్స్ రాదు - అప్పట్లో గ్రేట్ డ్యాన్సర్స్ అంటే వాళ్ళే: డిస్కో శాంతి




Join Us on Telegram: https://t.me/abpdesamofficial