Kalki 2898 AD Movie Ticket Rates Controversy: భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన చిత్రానికి అదే రేంజ్‌లో లాభాలు రావాలంటే టికెట్ల ధర పెంచాల్సిందే అని మేకర్స్ బలంగా ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న సినిమాలకు టికెట్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు సైతం అనుమతిని ఇస్తున్నాయి. అదే విధంగా ‘కల్కి 2898 AD’ టికెట్ ధరలు కూడా పెరిగాయి. ఈ మూవీ విడుదలయ్యి వారం రోజులు అవుతున్నా.. ఇంకా అధిక ధరలతోనే టికెట్లు కొనుక్కొని సినిమాను చూడడానికి థియేటర్లకు వెళ్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ఇదే విషయం మూవీని వివాదాల్లోకి తోసేసింది.


స్టే ఇవ్వాలి..


‘కల్కి 2898 AD’కు సంబంధించిన టికెట్ ధరలను పెంచుకోవడానికి 10 రోజుల పాటు అనుమతిని ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ సినిమాను చూడడానికి ఇంకా ప్రేక్షకులు భారీ సంఖ్యలు థియేటర్లకు వస్తుండడంతో 10 రోజులు సరిపోదని, మరో 4 రోజుల పాటు టికెట్ ధరలను అలాగే ఉంచాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో ‘కల్కి 2898 AD’ టికెట్ ధరల పెంపును ఖండిస్తూ ఒక వ్యక్తి.. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. టికెట్ రేట్లు పెరగకుండా స్టే ఇవ్వమని కోరారు. ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోవడంతో దీనిని క్యాష్ చేసుకుందామని మేకర్స్ అనుకున్నారు కానీ అదే వారిపై పిటీషన్ దాఖలు అయ్యేలా చేసింది.


నిర్మాతకు నోటీసులు..


‘కల్కి 2898 AD’ టికెట్ రేట్ల పిటీషన్‌పై హైకోర్టు విచారణ మొదలుపెట్టింది. అసలు సినిమాలకు టికెట్ ధరలు పెంచే అధికారం ప్రభుత్వాలకు ఉందా లేదా అనే విషయంపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ పిటీషన్‌పై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ‘కల్కి 2898 AD’ నిర్మాత అశ్వినిదత్‌కు నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణను వాయిదా వేసింది. దీంతో ఈ మూవీ టికెట్ ధరలు వెంటనే తగ్గించాల్సిన పరిస్థితి వచ్చిందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ ఓ రేంజ్‌లో కలెక్షన్స్ సాధించింది కాబట్టి ఇప్పుడు టికెట్ ధరలు తగ్గించినా పర్వాలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


కలెక్షన్స్ ఎంతంటే..


విడుదలయిన మొదటి వారంలో ప్రపంచవ్యప్తంగా రూ.335 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది ‘కల్కి 2898 AD’. ఇక ఈ సినిమా విడుదలయిన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటికీ చాలా థియేటర్లు హౌజ్‌ఫుల్‌గా నిండిపోతున్నాయి. నాగ్ అశ్విన్ విజన్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నాయి. హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ ప్రశంసించేస్తున్నారు. ఈ మూవీలో హీరో ప్రభాస్ అయినా కూడా ఇందులోని ప్రతీ క్యారెక్టర్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇచ్చాడు నాగ్ అశ్విన్. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ రోల్ అయితే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. దీపికా పదుకొనె కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. మూవీలో దిశా పటానీ కనిపించేది కాసేపే అయినా తన గ్లామర్‌తో అందరినీ అలరించింది.



Also Read: ప్రభాస్‌తో డేటింగ్? DP టాటూపై స్పందించిన దిశా పటానీ - అదేంటీ అలా అనేసింది