'విక్రమ్' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్.. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ప్రస్తుతం శివ కార్తికేయన్, సాయి పల్లవిల కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ను కోలీవుడ్ కు పరిచయం చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.


జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీలో పనిచేయాలనే తన కోరికను పదే పదే వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగా ముందుగా టాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' సినిమాలో యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సౌత్ లో తన మొదటి సినిమా రిలీజ్ కాకముందే అతిలోక సుందరి కూతురు తన రెండో సినిమాకు సైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. అది కూడా కమల్ హాసన్ ప్రొడక్షన్ లో అని అంటున్నారు.


విఘ్నేశ్ దర్శకత్వంలో 'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని, దీన్ని కమల్ హసన్ నిర్మిస్తారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ తమిళ ప్రాజెక్ట్ కోసమే జాన్వీ కపూర్ ని తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.


జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి మరియు కమల్ హాసన్ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. వెండితెరపై మ్యాజిక్ ను క్రియేట్ చేసిన ఈ జంట.. తమ అద్భుతమైన నటనతో, రిమార్కబుల్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు కమల్ దివంగత నటి కుమార్తెను తమిళ్ ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.


ఇకపోతే 'దఢక్' సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్.. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 'దేవర' వంటి పాన్ ఇండియా సినిమాతో పాటుగా బవాల్, మిస్టర్ అండ్ మిస్సెస్ మహి, ఉలాఖ్ వంటి పలు హిందీ సినిమాలలో నటిస్తోంది. మరోవైపు కమల్ హసన్ శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' చిత్రంతో నటిస్తున్నారు. ఇది 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్. అలానే రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి 'ప్రాజెక్ట్ K' సినిమాలో భాగం అవుతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 


Also Read: Project-K: ఐడల్ ప్రభాస్‌తో కలసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను - అమితాబ్ బచ్చన్ 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial