సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి, ప్రేక్షకులను థియేటర్ల వరకూ రప్పించడానికి.. మేకర్స్ ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్ని అన్వేషించాల్సి వస్తోంది. అందుకే రెగ్యులర్ గా చేసే పబ్లిసిటీకి తోడుగా, డిఫెరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీలతో ముందుకు వస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలకు ప్రమోషన్స్ అనేవి చాలా కీలకంగా మారాయి. ఎంతో వినూత్నంగా ప్రచారం చేస్తేనే అంతో ఇంతో ఆడియన్స్ దృష్టిలో పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు లేటెస్టుగా 'రెజీనా' అనే చిన్న సినిమాని ప్రమోట్ చేయడానికి చిత్ర బృందం 'హీరోయిన్ కిడ్నాప్' అంటూ డ్రామా చేసి అబాసుపాలయ్యారు.


కోలీవుడ్ హీరోయిన్ సునైనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'రెజీనా'. డొమిన్ డిసిల్వా అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీని ఎయిరా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌ పై స‌తీశ్ నాయ‌ర్ నిర్మిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై బజ్ తీసుకురావడానికి మేకర్స్ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ ప్లాన్ చేసారు. నటి సునయన గత రెండు రోజులుగా కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో ఓ వార్తను ప్రచారం చేసారు. దీంతో హీరోయిన్ ను ఎవ‌రో గుర్తు తెలియ‌ని దుండ‌గ‌లు కిడ్నాప్ చేశారనే న్యూస్ వైరల్ అయ్యింది. 


సునైనా మొబైల్ ఫోన్ కూడా రెండు రోజులుగా స్విచ్ ఆఫ్‌ లో ఉందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆమెకు ఏమైందోన‌ని కంగారు పడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెను ర‌క్షించాలంటూ 'రెస్క్యూ సునైనా' హ్యాష్ ట్యాగ్‌ ను సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. ఈ విషయం కాస్తా తమిళనాడు పోలీసుల దృష్టికి చేరడంతో, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సునయన చివరి సారిగా ఎగ్మూర్ నుంగంబాక్కం, కోయంబేడు, విరుగంబాక్కం ప్రాంతాల్లో సంచరించినట్లు సమాచారం అందటంతో, ఆయా ప్రాంతాల్లో ఆమె కోసం వెతికారు. ఈ క్ర‌మంలో చిత్ర నిర్మాణ సంస్థ‌ను ఆరా తీయ‌గా అస‌లు విష‌యం బయటపడింది. 


నిజంగా హీరోయిన్ కిడ్నాప్ కాలేద‌ని, అదంతా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్లాన్ చేసిన డ్రామా అని తెలుసుకుని పోలీసులు, అభిమానులు అందరూ షాకయ్యారు. హీరోయిన్ సునైనా సైతం వెంటనే లైన్ లోకి వచ్చి తాను సేఫ్ గానే ఉన్నానంటూ తెలిపింది. తనని ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. తన పాత్ర ఇంటెన్సిటీని చూపించడానికి ఇలా చేశామని చెప్పింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే మూవీ పబ్లిసిటీ కోసం మేకర్స్ చేసిన పని కొందరికి కోపం తెప్పించింది. ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారా అని నెటిజన్లు చిత్ర బృందంపై మండిప‌డుతున్నారు. దీనికి కారణమైన సునైనా మరియు మేకర్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


కాగా, 'వాళండిల్‌ కాల్తేనే' అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన నటి సునయన.. 'కుమార్ వర్సెస్ కుమారి' చిత్రంతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'సమ్‌ థింగ్ స్పెషల్' '10థ్ క్లాస్' వంటి సినిమాల్లో నటించింది. మధ్యలో కొన్ని డబ్బింగ్ చిత్రాలతో పలకరించిన ఈ బ్యూటీ.. శ్రీవిష్ణుకు జోడీగా 'రాజ రాజ చోర' మూవీతో ఆకట్టుకుంది. విశాల్ హీరోగా చేసిన ‘లాఠీ’ చిత్రంలోనూ ఆమె హీరోయిన్ గా నటించి మెప్పించింది. 


Read Also: రమాప్రభను శరత్‌బాబు పెళ్లి చేసుకోలేదా? ఆమెతో విభేదాలు ఎందుకొచ్చాయి?