Guntur Kaaram action on Book My Show: సంక్రాంతి సందర్భంగా త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’. 11 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో దీని గురించి అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పోస్టర్స్, టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. కానీ సినిమా విడుదల తర్వాత వారి అంచనాలను అందుకోలేకపోయింది. సినిమాకు పాజిటివ్ తప్పా నెగిటివ్ రివ్యూలే ఎక్కువగా వస్తున్నాయి. ఇదే సమయంలో బుక్ మై షోలో ‘గుంటూరు కారం’కు కావాలని ఫేక్ ఓట్లు పడుతున్నాయని, ఆ ప్లాట్‌ఫార్మ్‌పై లీగల్ యాక్షన్‌కు సిద్ధమయ్యారు మేకర్స్.


70 వేల బోట్స్‌తో..
‘బుక్ మై షో’ అనేది సినిమా టికెట్ బుకింగ్స్‌లోనే అతిపెద్ద ప్లాట్‌ఫార్మ్. ప్రస్తుతం టాలీవుడ్‌లో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ‘గుంటూరు కారం’ టీమ్ బుక్ మై షోపై సైబర్ కంప్లయింట్ ఫైల్ చేసిందట. బుక్ మై షోలో మోసపూరిత కార్యకలాపాలు జరుగుతున్నాయని కంప్లయింట్‌లో పేర్కొన్నట్టు సమాచారం. ఇప్పటికే ‘గుంటూరు కారం’ మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. అయితే ప్రేక్షకులను మరింత ప్రభావితం చేయడం కోసం బుక్ మై షో దాదాపు 70 వేల బోట్స్‌ను క్రియేట్ చేసి సినిమాకు తప్పుడు రేటింగ్స్ ఇస్తూ.. తప్పుడు రివ్యూలను ఇస్తూ పరిస్థితిపై ప్రభావితం చేయాలని చూస్తుందని ఆరోపిస్తున్నారు మేకర్స్. ఈ విషయాన్ని ఫిల్మ్ ఛాంబర్ వరకు తీసుకెళ్లి, అసలు ఏం జరిగిందో విచారించమని, వెంటనే యాక్షన్ తీసుకోమని మేకర్స్ కోరారు.


కఠినమైన చర్యలు తప్పవు..
బుక్ మై షోలో కనిపించే లైక్స్‌ను బట్టి, రేటింగ్ బట్టి సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులు కూడా ఉంటారు. ఇక ‘గుంటూరు కారం’ విషయంలో ఈ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్ చేసిన పని వల్ల చాలామంది ప్రేక్షకులు సినిమా చూడకూడదు అని డిసైడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలాంటివి జరగడం వల్ల సినిమా కమర్షియల్ సక్సెస్‌పై ఎఫెక్ట్ పడడంతో పాటు ఎంటర్‌టైన్మెంట్ రంగంపై కూడా చాలా చెడు ప్రభావం పడుతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారట. ఈ ఫేక్ ఓటింగ్ ప్రచారంపై ఎలాగైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇంకొకసారి ఏ సినిమాకు ఇలా జరగకుండా చూడాలని వారు సన్నాహాలు చేస్తున్నారు. లీగల్ టీమ్‌ను రంగంలోకి దించడానికి సిద్ధమయ్యారు.


ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌పై కూడా..
బుక్ మై షోతో పాటు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఇలాంటి యాక్టివిటీలలో పాల్గొంటున్నాయని, అనవసరంగా సినిమాలపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చి ప్రేక్షకుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు. అందుకే ఇలా చేస్తున్న అందరిపై యాక్షన్ తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ‘గుంటూరు కారం’ విషయానికొస్తే.. ఇందులో మహేశ్ బాబు యాక్టింగ్, డ్యాన్సులు, స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రమే బాగుందని, అంతకు మించి సినిమాలు ఏమీ లేదని చాలామంది ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చారు. ఇందులో మహేశ్‌కు జోడీగా శ్రీలీల నటించగా.. తన డ్యాన్స్‌కు కూడా ప్రేక్షకులు మరోసారి ఫిదా అవుతున్నారు. తమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆశించినంత రేంజ్‌లో మెప్పించలేకపోయింది.


Also Read: ‘యానిమల్‘ నాకు సరిపడే సినిమా కాదు, హింస, సెక్స్ ను చూడాలనుకోను: కొంకణా సేన్