Nagarjuna about Narendra Modi: ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా.. పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ అనే ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. మాల్దీవ్స్‌కు ఎక్కువ ఆదాయం ఇండియన్ టూరిస్ట్‌ల నుండే వచ్చినా వారు చేసిన కొన్ని వ్యాఖ్యలు భారత ప్రభుత్వానికి నచ్చలేదు. అలా రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలయ్యింది. మల్దీవ్స్‌కు ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్‌ను టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటికే దానికి తగిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం లక్షద్వీప్ గురించి చాలామంది ఇండియన్స్ తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయంపై కింగ్ నాగార్జున కూడా తాజాగా స్పందించారు.


టికెట్స్ క్యాన్సల్..
సీనియర్ హీరో నాగార్జున లీడ్ రోల్ చేసిన ‘నా సామిరంగ’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ టాక్ లభిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు సంక్రాంతి సమయంలో గట్టి పోటీ ఉన్నా.. తన సినిమాలతో హిట్లు అందుకున్నారు నాగార్జున. ఇక ‘నా సామిరంగ’ అదే లిస్ట్‌లో హ్యాట్రిక్ హిట్ అని ప్రేక్షకులు పాజిటివ్ రియాక్షన్ ఇస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో నాగార్జున ఒక ఆసక్తికరమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. మాల్దీవ్స్‌కు వెళ్దామని అంతా ప్లాన్ చేసుకున్నానని.. కానీ జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వెళ్లకూడదని టికెట్స్ క్యాన్సల్ చేసుకున్నానని బయటపెట్టారు. అసలు మాల్దీవ్స్ ట్రిప్‌ను క్యాన్సల్ చేసుకోవడం వెనుక అసలు కారణాన్ని కూడా రివీల్ చేశారు. ఇండియన్ ప్రభుత్వానికి సపోర్ట్‌గా మాట్లాడారు.


మాల్దీవ్స్ వెళ్దామనుకున్నా..
‘బిగ్ బాస్’కు హోస్ట్‌గా, ‘నా సామిరంగ’లో హీరోగా దాదాపు 75 రోజులు నాగార్జున విరామం లేకుండా పనిచేశానని బయటపెట్టారు. అందుకే ఈ టైట్ షెడ్యూల్ ముగిసిన తర్వాత ఒక హాలీడేను ప్లాన్ చేసుకున్నానని అన్నారు. జనవరి 17న మాల్దీవ్స్‌కు టికెట్స్ కూడా బుక్ చేసుకున్నానని తెలిపారు. కానీ మల్దీవ్స్‌కంటే లక్షద్వీప్ బంగారం ఐల్యాండ్స్‌కు వెళ్లడం మంచిదని భావిస్తున్నానని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు నాగార్జున. ‘నా సామిరంగ’ మూవీ విడుదలకు ముందు చంద్రబోస్, కీరవాణిలతో కలిసి నాగార్జున.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అదే సమయంలో ఈ విషయాన్ని రివీల్ చేశారు. 


ఎవరికో భయపడి కాదు..
‘‘ఏదో ఎవరికో భయపడి టికెట్స్ క్యాన్సల్ చేయడంలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే అది హెల్తీ కాదు కాబట్టి క్యాన్సల్ చేశాను. వాళ్లు చెప్పిన మాటలు, ఇచ్చిన స్టేట్‌మెంట్స్ అస్సలు కరెక్ట్ కాదు. ఆయన మన ప్రధానమంత్రి. 1.5 బిలియన్ ప్రజలను ఆయన ముందుకు నడిపిస్తున్నారు. 1.5 బిలియన్ ప్రజలకు ఆయనే లీడర్. ఆయనను వారు ట్రీట్ చేసిన పద్ధతి అస్సలు కరెక్ట్ కాదు’’ అన్నారు నాగార్జున. ఇప్పటివరకు సినీ సెలబ్రిటీలు ఎవ్వరూ ఈ మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ వివాదంపై స్పందించలేదు. కొందరు అయితే దీనిపై స్పందించకుండా, దేశానికి జరిగిన అవమానాన్ని పట్టించుకోకుండా మాల్దీవ్స్‌కు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు కూడా. అలాంటి సమయంలో నాగార్జున ఇలా దీనిపై స్పందించడం మాత్రమే కాకుండా.. ప్రధానమంత్రికి సపోర్ట్‌గా మాట్లాడడం మంచి విషయమని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.


Also Read: 'హనుమాన్‌' మూవీ చూసి ప్రశాంత్‌ వర్మ తండ్రి ఎమోషనల్‌ రియాక్షన్‌ - వీడియో వైరల్‌