1998 కృష్ణ జింకల కేసు సల్మాన్ ఖాన్ ను ఇప్పటికీ వీడటం లేదు. బిష్ణోయ్ కమ్యూనిటీ పవిత్రంగా భావించే కృష్ణ జింకలను వేటాడిన సల్మాన్ ను కచ్చితంగా చంపుతానని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాడు గ్యాంగ్ స్టర్  లారెన్స్ బిష్ణోయ్. తరుచుగా ఈ విషయంలో సల్మాన్ కు బిష్ణోయ్ బ్యాచ్ నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇదే విషయానికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ కీలక విషయాలు వెల్లడించింది. బిష్ణోయ్ టాప్ హిట్ లిస్టులో సల్మాన్ పేరు ఉన్నట్లు వివరించింది. టాప్ టెన్ లిస్టులో సల్మాన్ పేరే నెంబర్ గా ఉన్నట్లు తెలిపింది.

    


సల్మాన్ కు Y+ కేటగిరీ భద్రత


బిష్ణోయ్ ని తాజాగా ఎన్ఐఏ అధికారులు విచారించారు.  గత ఏడాది డిసెంబర్‌లో  తన ఆదేశాల మేరకు తన అనుచరుడు సంపత్ నెహ్రా, ముంబైలో సల్మాన్ ఖాన్ నివాసం దగ్గర రెక్కీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత  హర్యానా  స్పెషల్ టాస్క్ ఫోర్స్ నెహ్రాను అరెస్ట్ చేసింది.  ఈ ఏడాది ఏప్రిల్ 11న సల్మాన్ ఖాన్‌కు మరో బెదిరింపు కాల్ వచ్చింది. ఆయన చంపేస్తామంటూ ఇమెయిల్ కూడా పంపారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తరుచుగా బెదిరింపులు రావడంతో సల్మాన్‌కు ముప్పు పొంచి ఉందని భావించిన ముంబై పోలీసులు అతడికి Y+ కేటగిరీ భద్రతను కల్పించారు.  


గాయకుడు సిద్ధూ మూసేవాలాను హత్య చేసిన బిష్ణోయ్ గ్యాంగ్


నటుడు సల్మాన్ ఖాన్ కార్యాలయానికి బెదిరింపు ఇమెయిల్‌లు పంపినందుకు గాను ముంబై పోలీసులు గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్,  రోహిత్ గార్గ్‌ పై   కేసు నమోదు చేశారు. వీరి మీద బాంద్రా పోలీసులు ఐపీసీ 506(2),120(బి), 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో వీరంతా శిక్ష అనుభవిస్తున్నారు. బిష్ణోయ్, 2021లో గోగీ గ్యాంగ్ కోసం గోల్డీ బ్రార్ ద్వారా అమెరికా నుంచి రెండు 'జిగానా' సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్‌ ను సేకరించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ ముఠా సభ్యులే ఈ ఏడాది ఏప్రిల్‌లో టిల్లూ తాజ్‌పురియాపై తీహార్ జైలులో  దాడి చేసి హత్య చేశారు. గత ఏడాది పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసింది. ఈ హత్యకు బాధ్యత బిష్ణోయ్ ప్లాన్ వేయగా, ఆయన అనుచరుడు కెనడాకు చెందిన బ్రార్ పర్యవేక్షించారు. తాజ్‌పురియా హత్యకు కూడా బ్రార్ బాధ్యత వహించాడు.


బిష్ణోయ్ హిట్ లిస్టులో సిద్ధూ మూసేవాలా మేనేజర్


బిష్ణోయ్ హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్‌తో పాటు, దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసే వాలా మేనేజర్ షగన్‌ ప్రీత్‌ను కూడా ఉన్నట్లు ఎన్ ఐఏ విచారణలో తేలింది. కెనడాకు చెందిన గోల్డీ బ్రార్ గతంలో విక్రమ్‌జిత్ సింగ్ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే సింగర్ సిద్ధూ మూసేవాలాను హత్య  చేసినట్లు వెల్లడి అయ్యింది. సిద్ధు మూసేవాలా హత్య కేసుతో పాటు పలు కేసుల్లో లారెన్స్ బిష్ణోయ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.


Read Also: సల్మాన్ ఖాన్ గ్యారేజీలోకి సరికొత్త బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?