సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించే దగ్గర నుంచి, గుమ్మడికాయ కొట్టే వరకూ.. అన్నీ సెంటిమెంట్ తో ముడిపడి ఉంటాయి. ఫస్ట్ లుక్స్, టీజర్లు, ట్రైలర్స్, సాంగ్స్.. ఇలా ప్రతీది మంచి ముహూర్తం చూసే విడుదల చేస్తుంటారు. ఫలానా తేదీన ఫలానా సమయానికి అప్డేట్ వస్తుందని చెబుతూ, అనుకొన్న ముహూర్తం ప్రకార‌మే రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో 'అర్థరాత్రి' టైంలో లేదా తెల్లారుజామున కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్లు రావడాన్ని మనం గమనించవచ్చు. ఒకరిని చూసి ఒకరు ఇదే పద్ధతిని ఫాలో అవ్వడంతో ఇప్పుడదే ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ గా మారిపోయింది. 


రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్నాళ్లూ 'ప్రాజెక్ట్ K' గా పిలవడిన ఈ సినిమా టైటిల్ ను, ఇటీవల శాన్‌ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో అనౌన్స్ చేసారు. ఈ సందర్భంగా ఫస్ట్ గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేసారు. ఇండియా టైం ప్రకారం జులై 20న అర్థరాత్రి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.


కోలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న 'కంగువ' మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ని కూడా మిడ్ నైట్ రిలీజ్ చేశారు. Jul 22వ తేదీ రాత్రి 12 గంటలకు యూట్యూబ్ లో వదిలారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని స్టూడియో గ్రీన్ & యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలానే ధనుష్ నటిస్తున్న 'కెప్టెన్ మిల్లర్' సినిమా టీజర్ ను జులై 28 అర్థరాత్రి విడుదల చేశారు. అరుణ్‌ మాథేశ్వరన్‌ ఈ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. 


Also Read: మహేష్ బాబు గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?


లేటెస్టుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' సినిమా అప్డేట్ కూడా అర్ధరాత్రే వచ్చింది. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా 12.00 AM కి ఓ స్పెషల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆగస్టు 9న మరో న్యూ పోస్టర్ వదిలారు కానీ, అది వేరే సంగతి. ఫస్ట్ పోస్టర్ లో సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పేర్లు ఉన్నాయి. వీరిద్దరినీ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో, వారి పేర్లు లేకుండా రెండో పోస్టర్ ను విడుదల చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 


ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా 'సలార్' పార్ట్-1 టీజర్ ను జూలై 6వ తేదీ ఎర్లీ మార్నింగ్ 5:12 గంటలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా ఇంగ్లీష్ డైలాగ్ తో ఈ వీడియోని కట్ చేసారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక డార్లింగ్ గత చిత్రం 'ఆదిపురుష్' సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఒకే టైంకి వచ్చేవి. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకూ అన్నీ ఉదయం గం.7:11 నిమిషాలకు రిలీజ్ చేసేవారు. 


అయితే ఇప్పటి వరకూ అర్థరాత్రి లేదా తెల్లవారుజామున విడుదల చేసిన సినిమాల గ్లిమ్స్, టీజర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముహూర్త బలం కుదరలేదేమో 'ఆదిపురుష్' మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మరి మిగతా చిత్రాల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ట్రెండ్ మాట ఎలా ఉన్నా.. దెయ్యాలు తిరిగే టైములో ఈ అప్‌డేట్‌లు ఏమిటిరా బాబు అని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.


Also Read: 'తమ్ముడు' పక్కన పెట్టేసిన రీమేక్ తో 'అన్నయ్య' హిట్టు కొడతాడా?


Join Us on Telegram:https://t.me/abpdesamofficial