Eagle Movie Makers Letter to Film Chamber: రవితేజ ఈగల్‌ మూవీకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. నిజానికి ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా థియేటర్ల సమస్య తలెత్తడంతో వాయిదా పడింది. నిర్మాతల మండలి కోరిక మేరకు నిర్మాణ సంస్థ పీపుల్స్‌ మీడియా, రవితేజలు వెనక్కి తగ్గి సినిమాను పోస్ట్‌పోన్‌ చేశారు. అయితే ఓ కండిషన్‌ మీదే ఈగల్‌ వాయిదా పడింది. ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలతో పాటు మరిన్ని చిత్రాలు ఉండటంతో థియేటర్లు సర్దుబాటు కాలేదు. దీంతో ఫిలిం చాంబర్‌ పెద్దలు పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, రవితేజలను సినిమా వాయిదా వేసుకోవాలని కోరారు.


ఈ సంక్రాంతికి తప్పుకుంటే తమ సినిమాకు సోలో రిలీజ్‌ డేట్‌ ఇస్తామని మాట కూడా ఇచ్చిందట ఫిలిం చాంబర్‌. దీంతో సినిమాను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఈగల్‌కు రిలీజ్‌ టైంలోనే ఫిబ్రవరి 8న యాత్ర 2, ఫిబ్రవరి 9న సందీప్‌ కిషన్‌ భైరవ కోన, లాల్ సలామ్ డబ్బింగ్ చిత్రాల రిలీజ్‌తో పాటు మరిన్ని చిన్న సినిమాలు కూడా అదే రోజు రిలీజ్‌ కాబోతున్నాయి. దీంతో తమకు సోలో తేదీ ఇస్తామన్న ఫిలిం చాంబర్‌కు దీనిపై తాజాగా నిర్మాణ సంస్థ ఫిలిం చాంబర్‌కు లేఖ రాసింది. 


Also Read: విజువల్‌ ట్రీట్‌ ఇచ్చిన 'హనుమాన్‌' విగ్రహం నిజంగా ఉందా? మూవీ షూటింగ్‌ లొకేషన్స్‌ ఎక్కడంటే..


పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ తమ లేఖలో ఇలా పేర్కొంది. "ఫిలిం చాంబర్‌ పెద్దలు, నిర్మాతల కోరిక మేరకు, సినీ పరిశ్రమ మంచి కోసం ఈ సంక్రాంతికి జనవరి 13న విడుదల చేయాల్సిన మా ఈగల్‌ సినిమాను వాయిదా వేశాం. అందుకు మా సినిమాకి సోలో రిలీజ్‌ డేట్‌ ఇప్పిస్తామన్నారు. కానీ ఇప్పుడు వరుసగా పలు సినిమాలకు రిలీజ్‌ సిద్ధమవుతున్నాయి. వాటితో పాటు కాకుండా మీరు మాట ఇచ్చినట్టుగా ఈగల్‌కు సోలో రిలీజ్‌ డేట్‌ ఇవ్వాలని కోరుతున్నాము. ఈ విషయాన్ని చాంబర్‌ పెద్దలు గమనించాలని మా విజ్ఞప్తి" అని పేర్కొంది.


కాగా ఇప్పుడు ఈగల్‌ రిలీజ్‌ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దానితోడు రీసెంట్‌గా 'ఊరు పేరు భైరవకోన' ట్రైలర్‌ ఈవెంట్‌లో ఫిబ్రవరి 9న తమ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టు  చెప్పాడు. అదే రోజు ఈగల్‌ సినిమా ఉంది కదా అని ప్రశ్నించగా.. రిలీజ్‌ విషయంలో తాము వెనక్కి తగ్గలేమని స్పష్టం చేశాడు. రవితేజ గారంటే తమకు అభిమానం ఉందని, కానీ తప్పట్లేదంటూ విలేకరుల అడిగిన ప్రశ్నపై సందీప్‌ కిషన్‌ స్పందించాడు. ఇక సందీప్‌ చేసిన కామెంట్స్‌ అనంతరం ఈగల్‌ నిర్మాతలు చాంబర్‌౮కు లేఖ రాయడం గమనార్హం. కాగా ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనిని 'ఈగల్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, మధుబాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Also Read: ప్రభాస్‌కు మరోసారి సర్జరీ! - తిరగబడిప గాయం, విదేశాలకు డార్లింగ్?