'నిన్ను కోరి' సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన శివ నిర్వాణ.. డెబ్యూతోనే సూపర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత 'మజిలీ' మూవీతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే క్రమంలో ఆయన రూపొందించిన 'టక్ జగదీశ్' సినిమా డైరెక్ట్ ఓటీటీ వేదికగా విడుదలై, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ను తనదైన ఎమోషన్స్ జత చేసి తెరపై చూపిస్తూ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు దర్శకుడు శివ. ఈ క్రమంలో ఇప్పుడు 'ఖుషి' అనే రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ను అలరించడానికి వస్తున్నారు.


యంగ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందించిన సినిమా ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శివ మీడియాతో ముచ్చటించి, సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.


'ఖుషి' సినిమా స్టోరీ గురించి మాట్లాడుతూ.. ''పెళ్లికి ముందు పెళ్లి తర్వాత సమస్యలతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో టైటిల్ కు తగినట్లుగా ఎంటర్టైన్మెంట్ తో కథను చెప్పాలని అనుకున్నాను. ట్రైలర్ లో ఎంటర్టైన్మెంట్ తో ఉన్న సీన్స్ చూశారు. ఇవన్నీ థియేటర్ లో హార్ట్ టచింగ్ గా ఉంటాయి'' అని శివనిర్వాణ చెప్పారు. 'డియర్ కామ్రేడ్' సినిమా టైంలో విజయ్ కి ఈ స్టోరీ చెప్పానని, ఏడాదిన్నర తర్వాత సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లామని తెలిపారు. ఈసారి ఔట్ ఆఫ్ ది బాక్స్ మూవీ చేయాలని అనుకున్నానని, విజయ్ కి 'ఖుషి' లైన్ నచ్చడంతో ఈ జర్నీ మొదలైందన్నారు.


'నిన్ను కోరి', 'మజిలీ' సినిమాల్లో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చూపించాను. కానీ ఈసారి ఒక ఎంటర్టైనింగ్, ఎనర్జిటిక్, సరదాగా ఉండే ప్రేమ కథను రూపొందించాలని అనుకున్నాను. నేను వ్యక్తిగతంగా చాలా సరదాగా ఉండే మనిషిని. ఈ సినిమాకు 'సరదా' అని, మరికొన్ని టైటిల్స్ కూడా అనుకున్నాను. కానీ విజయ్, సమంతకున్న పాన్ ఇండియా ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాని తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఐదు భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అలా ‘ఖుషి’ టైటిల్ ఫిక్స్ చేశామని దర్శకుడు వివరించారు.


ఈ సినిమా హీరో అనీ, హీరోయిన్ అనీ ఎవరి వెర్షన్ లో ఉండదు. బ్యాలెన్స్ గా ఉంటుంది. ఇది విజయ్ తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత సమంత లాంటి ఫర్ఫార్మింగ్ హీరోయిన్ ఉంటే సినిమా మరింత స్ట్రాంగ్ అవుతుందని భావించాం. సామ్ షూటింగ్ కోసం ఎంతో కోపరేట్ చేస్తుంది. చాలా డెడికేటెడ్ హీరోయిన్. అలాంటి హీరోయిన్ కు ఒక హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మేమంతా సపోర్ట్ చేయాలి అనుకున్నాం. ఆమె ట్రీట్ మెంట్ మధ్యలో గ్యాప్ ఇస్తూ షెడ్యూల్స్ చేయడం ఇబ్బందిగా అనిపించి, పూర్తిగా నయమైన తర్వాతే సెట్స్ లోకి రమ్మని చెప్పామని శివ నిర్వాణ తెలిపారు.


ప్రేమ కథని ఎంత కొత్తగా చెప్పాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్. కథ రాసేప్పుడు సెకండాఫ్ రెడీ అయ్యింది. కానీ ఫస్టాఫ్ లో లవ్ స్టోరీని కాలేజీలో చూపించకుండా ఒక ఫీల్ గుడ్ ప్లేస్, ప్లెజంట్ గా ఉండే ప్లేస్ నుంచి మొదలుపెడితే బాగుంటుంది అనిపించింది. అలాగే హీరో హీరోయిన్ల మధ్య పరిచయం ఫన్ తో సాగాలి అనుకున్నాను. ట్రైలర్ లో చూపించినట్లు హీరోయిన్ ను బేగమ్ అని ఒకసారి, మరోసారి ఇంకోలా పిలుస్తుంటాడు హీరో. ఇవన్నీ సరదాగా ఉంటాయి. ఈ మూవీలో విజయ్ దేవరకొండను లేడీ ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు అని 'ఖుషీ' డైరెక్టర్ చెప్పారు.


Also Read: కింగ్ నాగార్జునకు విలన్ గా మారిన విలక్షణ దర్శకుడు - ఆయన్ను గుర్తు పట్టారా?


'సఖి' సినిమాతో పోలికలు రావడంపై శివ నిర్వాణ స్పందిస్తూ.. ‘ఖుషి’ సినిమా మణిరత్నం ‘సఖి’ లాంటి పాయింట్ అనే వార్తలు వచ్చాయి. కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. ఇవాళ్టి కాంటెంపరరీ సొసైటీలో ఉన్న ఒక ఇష్యూను విజయ్, సమంత లాంటి పాపులర్ స్టార్స్ ద్వారా అడ్రస్ చేయిస్తే బాగుంటుందని నమ్మాను. వాళ్లకూ ఈ పాయింట్ కనెక్ట్ అయ్యింది. ఆ పాయింట్ ఏంటనేది ట్రైలర్ లో మేము చూపించలేదు. థియేటర్ లో చూడాలి అని అన్నారు.


'హృదయం' పాటలు విని ‘ఖుషి’ మ్యూజిక్ కోసం హేషమ్ ను కలిసినప్పుడు ఆయన మంచి మ్యూజిక్ ఇవ్వగలడని అనిపించింది. విజయ్ కూడా ఓకే అన్నాడు. హేషమ్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. 'నా రోజా నువ్వే' సాంగ్ హిందీ సహా అన్ని లాంగ్వేజెస్ లో హిట్టయ్యింది. ఈ సినిమాలో హీరోకు కాశ్మీర్ అంటే ఇష్టం, మణిరత్నం సినిమాలను ప్రేమిస్తాడు. ఆ క్యారెక్టర్ పాడినట్లు.. నా రోజా నువ్వే, దిల్ సే నువ్వే, అంజలి, గీతాంజలి నువ్వే అని లిరిక్ రాసి ఇస్తే.. దానికి హేషమ్ ట్యూన్ చేసి పాడాడు. అది టీమ్ అందరికీ వినిపిస్తే చాలా బాగుందన్నారు. అలా నేను ఏదో లైన్ రాయడం.. హేషమ్ ట్యూన్ కుదరడం జరిగింది. ఇదేదో బాగా వర్కవుట్ అవుతుందని అలానే మొత్తం పాటలన్నీ చేశాం. నా గత సినిమాల్లోనూ పాటలు రాశాను. నాకు లిరిసిస్ట్ లు అందరితో మంచి రిలేషన్ ఉంది. నెక్ట్ మూవీస్ కు వాళ్ళ తో కలిసి పనిచేస్తా. అప్పుడు కుదిరితే నేను కూడా రాస్తాను అని చెప్పారు.


విజయ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. పెళ్లి చూపులు, గీత గోవిందంలో ఒకలాంటి కామెడీ టైమింగ్ చూశారు. కానీ ఇందులో స్టైలిష్ కామెడీ చేశాడు. అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియెన్స్ కు విజయ్ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. అందరూ ఆయన క్యారెక్టర్ ను ఓన్ చేసుకుంటారు. ‘ఖుషి’ లో హిందూ ముస్లిం మధ్య గొడవలు చూపించడం లేదు. కానీ ఒక వెరీ సెన్సిటివ్ ఇష్యూను కథలో చూపిస్తాం. అది మీకు నచ్చుతుంది. ఒక ప్లెజంట్ ఎట్మాస్పియర్ కోసమే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నామని శివ వివరించారు. 


అలానే ఇందులో వింటేజ్ సమంతను చూస్తారని దర్శకుడు చెప్పారు. ఆమె 'ఫ్యామిలీ మ్యాన్' వంటి డిఫరెంట్ జానర్స్ చేసినా, ఇప్పుడు లవ్ స్టోరిలో సమంతను చూడటం మంచి ఫీల్ కలిగిస్తుందన్నారు. ‘ఖుషి’ సినిమా కథకు సమంత రియల్ లైఫ్ కు ఎలాంటి పోలికలు, సంబంధం లేదు. మూడేళ్ల క్రితం రాసుకున్న కథ ఇది. ఆమెతో 'మజిలీ' సినిమా చేశాను కాబట్టి బాగా నటించగలదని ఇందులోకి తీసుకున్నాం. నేను రాసిన కథలో ఆమె తన క్యారెక్టర్ ప్లే చేసింది అంతే. మరో హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తే ఇలాంటి ప్రశ్నలకు అవకాశం ఉండదు అని శివ నిర్వాణ అన్నారు.


Also Read: ధనుష్ మూవీలో పవర్ ఫుల్ రోల్‌ లో కింగ్ నాగ్!


ఖుషి నిర్మాతల గురించి దర్శకుడు మాట్లాడుతూ.. మైత్రీ నిర్మాతలు డైరెక్టర్స్ కు ఎంతో ఫ్రీడమ్ ఇస్తారు. వాళ్లు ఇచ్చిన రిసోర్సెస్ ను బాగా ఉపయోగించుకోవాలే గానీ ఎంతైనా క్రియేటివిటీ చూపించుకోవచ్చు. ప్రతి దర్శకుడూ మైత్రీ వాళ్ల గురించి మంచిగా చెబుతారు. 'నిన్ను కోరి' యూఎస్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు నిర్మాత నన్ను కలిసి, మనం సినిమా చేయాలని అన్నారు. నేను ఈ కథ చెప్పినప్పుడు వారు హార్ట్ టచింగ్ గా ఫీలయ్యారు. మైత్రీ బ్యానర్ లో భారీ యాక్షన్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒక లవ్ స్టోరి నిర్మిస్తే బాగుంటుందని నిర్మాతలు అన్నారు. ఐదు నెలలు ‘ఖుషి’ షూటింగ్ ఆగిపోయినా ఏరోజూ వాళ్లు క్వశ్చన్ చేయలేదు. సెట్ కొచ్చి.. ఇంకొంచెం పెద్ద సెట్ వేస్తే బాగుండేది అనేవారంటే వాళ్లు ఎంత సపోర్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. నేను కనెక్ట్ అయితే వరుసగా సినిమాలు చేస్తాను. నానితో రెండు సినిమాలు చేశాను, అలాగే షైన్ స్క్రీన్స్ సంస్థలో రెండు మూవీస్ చేశాను. ఇప్పుడు మైత్రీతో అనుబంధం ఏర్పడింది అని చెప్పారు.


స్పీడ్ గా సినిమాలు చేయడం నా చేతిలో లేదు.. అదంతా డెస్టినీ అని దర్శకుడు అన్నారు. రెండేళ్లకో సినిమా చేస్తూ వచ్చా. మధ్యలో కోవిడ్ వచ్చింది. అప్పుడు కూడా కష్టపడి ఎలాగో 'టక్ జగదీశ్' కంప్లీట్ చేశాం. అది థియేటర్ కోసం చేసిన సినిమానే కానీ ఓటీటీకి వెళ్లింది. థియేటర్ లో రిలీజైతే దాని రిజల్ట్ ఎలా ఉండేదో తెలియదు. కానీ నేను మనసుపెట్టి చేసిన సినిమా అదని శివ నిర్వాణ తెలిపారు.


"నేను మణిరత్నం అభిమానిని. ఆయన సినిమాలను ఇష్టపడతాను. ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు చెన్నై వెళ్లి ఆయన దగ్గర జాయిన్ అవ్వాలనుకున్నా. అయితే వారం రోజులు ప్రయత్నించినా ఆయన్ని కలవడం కుదరలేదు. ఆయన సినిమాలను ఇష్టపడతాను కానీ నేను ఆయనలా తీయాలనుకోను. మణిరత్నంలా ఒక్క ఫ్రేమ్ కూడా ఎవరూ పెట్టలేరు. ఆయన సినిమాల్లోని ఈస్థటిక్ సెన్స్, మ్యూజిక్ సెన్స్ నుంచి ఇన్ స్పైర్ అవుతాం అంతే" అని శివ అన్నారు.


'బాహుబలి', 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్', 'కార్తికేయ' వంటి సినిమాలన్నీ మనకు నచ్చేలా చేసుకున్న సినిమాలు. ఇతర భాషల వాళ్లు ఇష్టపడటంతో పాన్ ఇండియా అయ్యాయి. నా దృష్టిలో మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చి పాన్ ఇండియా మూవీ అవుతుంది. దానికి మనం ప్లాన్ ముందే చేసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం. ‘ఖుషి’ చూసిన తర్వాత, థియేటర్ లో నుంచి ఒక మంచి అనుభూతితో బయటకు వస్తారని డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పుకొచ్చారు.


Also Read: నా సామిరంగ - ఈసారి సంక్రాంతికి 'బీడీలు' 3D లో కనిపిస్తాయేమో!?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial