యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా నటించిన సినిమా ‘కస్టడీ’. నాగచైతన్య కెరీర్ లో మొట్టమొదటిసారిగా ఒకేసారి తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ పాత్ర లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకు సంబంధించిన అప్డేట్స్ ను వరుసగా విడుదల చేస్తూ వస్తున్నారు మేకర్స్. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ మూవీకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ మేరకు మూవీ టీమ్ అంతా కలసి ఓ ఫన్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. మూవీ మే 12 న విడుదల అవుతుందని, అందరం మళ్లీ థియేటర్స్ లో కలుద్దాం అంటూ ఓ వీడియోను చేశారు. ఈ వీడియోను నాగ చైతన్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. 


ఈ ‘కస్టడీ’ మూవీను గతేడాది సెప్టెంబర్ లో ప్రారంభించారు. అప్పటి నుంచి విరామం లేకుండా షూటింగ్ జరిగింది. ఇటీవలే ఆఖరి షెడ్యూల్ ను కూడా ముగించింది మూవీ టీమ్. ఇక ఈ మూవీ షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండనుంది. ఇందుకోసం దాదాపు 3 నెలలు సమయం పడుతుందని ముందే అనుకున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి అటు ఇటుగా మూడు నెలల తర్వాత మే 12 న మూవీ ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. ఇదే విషయాన్ని గతంలో కూడా వెల్లడించారు. తాజాగా చైతన్య విడుదల చేసిన వీడియోలో కూడా అదే తేదీన మూవీను విడుదల చేయనునన్నట్లు ప్రకటించారు. 


ఈ మూవీకు సంబంధించిన అన్ని అప్డేట్ లను జాగ్రత్తగా రివీల్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. మొదట విడుదల చేసిన పోస్టర్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా ‘కస్టడీ’ గ్లింప్స్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ గ్లింప్స్ వీడియోలో నాగ చైతన్య మాస్ లుక్ లో అదరగొట్టాడనే చెప్పాలి. నాగ చైతన్య ఇంతకు ముందు కొన్ని మాస్ సినిమాలు చేశారు. అయితే, 'ఈ సినిమాలో మాత్రం ఆయన యాక్షన్ పూర్తిగా భిన్నంగా  ఉండబోతుందని గ్లింప్స్‌ చూస్తే తెలుస్తోంది. మరి నాగ చైతన్య ఎప్పటినుంచో ఎదురు చూస్తోన్న బ్లాక్ బస్టర్ మాస్ హిట్ ఈ సినిమాతో అందుతుందో లేదో చూడాలి.  


విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో నాగచైతన్య ఎప్పుడూ కొత్తగానే ఆలోచిస్తారు. ఆయన ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటాయి. గతంలో ‘బంగార్రాజు’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు నాగచైతన్య. ఈ మూవీ లో చై, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు మళ్లీ మరోసారి ఈ జంట కలసి నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు ఇద్దరు స్టార్ సంగీత దర్శకులు కూడా కలసి పనిచేస్తుండటం విశేషం. ఇక ఈ మూవీలో అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, 'వెన్నెల' కిశోర్ తదితరుల నటీనటులు కనిపించనున్నారు.