ప్రస్తుతం ఏపీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్లు ఉంది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు మెగా ఎటాక్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం... 'వాల్తేరు వీరయ్య' 200 డేస్ ఫంక్షన్!


''మీలాంటి పెద్దలు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేద వారికి కడుపు నిండే విషయాల గురించి గానీ, ఉద్యోగ  - ఉపాధి అవకాశాలు కల్పించడం గురించి ఆలోచించాలి. అంతే కానీ... పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి సార్?'' అని 'వాల్తేరు వీరయ్య' రెండొందల రోజుల వేడుకలో చిరంజీవి వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దాంతో వైసీపీ నాయకులు ఒక్కొక్కరూ చిరంజీవిపై మాటల దాడి మొదలు పెట్టారు. అసలు... ఆ రోజు జరిగింది ఏమిటి? వేదికపై చిరంజీవి వ్యాఖ్యానించినది ఏమిటి? ఆ మాటలకు ముందు, వెనుక చిరంజీవి చెప్పింది ఏమిటి? అనేది బయటకు రాలేదు. ఈ రోజు ఫుల్‌ వీడియో బయటకు వచ్చింది. 


హీరోల రెమ్యూనరేషన్స్ గురించి పెద్దలు సభలో ఎందుకు?
''ఎన్ని సినిమాలు చేస్తే... అంత మందికి ఉపాధి లభిస్తుంది. కడుపు నిండా తిండి ఉంటుంది. వాళ్ళు హాయిగా ఉంటారు. సినిమాలు ఎక్కువ చేసినా సరే... సినిమా వాళ్ళకు ఎక్కువ రెమ్యూనరేషన్లు ఇస్తున్నా సరే... పార్లమెంటులో, పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకు ఏమీ పనీ పాటా లేదా?'' అని చిరంజీవి వ్యాఖ్యానించారు. 


వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఇటీవల పెద్దల సభలో హీరోల రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడారు. సినిమా నిర్మాణ వ్యయంలో ఎక్కువ శాతం పారితోషికాల రూపంలో కథానాయకులకు వెళుతుందని వ్యాఖ్యానించారు. ఆ మాటకు వస్తే... వైసీపీ నాయకులు చాలా మంది పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి కామెంట్స్ చేస్తూ ఉంటారు. 'బ్రో' సినిమాకు ఎంత తీసుకున్నారో చెప్పాలని అంబటి రాంబాబు ప్రశ్నించిన సంగతి ప్రజలకు గుర్తు ఉండే ఉంటుంది. హీరోలు తీసుకునే డబ్బుల మీద శ్రద్ధ పెట్టడం మానేసి మిగతా అంశాలపై దృష్టి పెట్టాలని చిరు సున్నితంగా చెప్పినట్లు అయ్యింది. 


పార్లమెంటులో మాట్లాడటం దురదృష్టం! - చిరంజీవి  
''సార్... సినిమాలు చేస్తున్నామంటే బిజినెస్ అవుతుంది కాబట్టే! బిజినెస్ అవుతుంది కాబట్టే డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు. సినిమా మీద సినిమా చేస్తున్నామంటే... డబ్బుల మీద డబ్బులు ఇస్తారని కాదు సార్! మా వాళ్ళందరికీ ఉపాధి లభిస్తుందని! వాళ్ళందరూ హాయిగా ఉంటారని! ఇదేదో పెద్ద సమస్యలా... దేశంలో ఇంత కంటే పెద్ద సమస్య లేదన్నట్టు పార్లమెంటులో కూడా మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది'' అని చిరంజీవి వ్యాఖ్యానించారు. సినిమాను, రాజాకీయాలను దూరంగా ఉంచామని ఆయన కోరారు. 


వీలైతే ప్రభుత్వాలు సహకరించాలి!
తెలుగు చిత్ర పరిశ్రమ ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో ఉండటానికి కారణం తాము అంత ఖర్చు చేస్తున్నామని చిరంజీవి తెలిపారు. ఇటువంటి ఖర్చుకు ఎంతో కొంత రెవెన్యూ రావాలని కోరుకోవడం సమంజసమన్నారు చిరు. వీలైతే ప్రభుత్వాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ''అంతే కానీ... అణగదొక్కడానికో, ఇదేదో తప్పు అని దేశ వ్యాప్తంగా చెప్పడానికి రాజ్యసభ వరకు తీసుకు వెళ్ళవద్దని సవినయంగా విన్నవించుకుంటున్నాను'' అని చిరంజీవి మాట్లాడారు. 


Also Read : మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత లోయస్ట్ ప్రీ రిలీజ్ రికార్డ్ 'భోళా శంకర్'దే - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?



రాజకీయ నాయకులతో పోలిస్తే సినిమా చాలా చిన్నదని చిరంజీవి తెలిపారు. తాను అదీ (రాజకీయాలు) చూశానని, ఇదీ (సినిమాలు) చూశానని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం వంటి పెద్ద పెద్ద అంశాల గురించి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  


Also Read : ఈడో పెద్ద దూలగాడు, ఆడ పిల్లలను అలా చూడకు దరిద్రంగా - రాజా రవీంద్రకు చిరంజీవి చురకలు



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial