మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని కోరుకునే దర్శకులు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. అయితే, అందులో ఇద్దరు సీనియర్ దర్శకులు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరిలో చిరు ఛాన్స్ ఎవరికి దక్కుతుంది? అని టాలీవుడ్ జనాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు? అంటే... ఆ ఇద్దరు దర్శకులు స్నేహితులే. పైగా, ఇప్పుడు ఇద్దరూ తమను తాము ప్రూవ్ చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. 


'వాల్తేరు వీరయ్య'తో బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ స్టామినా ఏంటనేది మరోసారి ట్రేడ్ వర్గాల కళ్ళకు కట్టినట్లు తెలిసింది. కమర్షియల్ కథలతో వంద కోట్లు అవలీలగా వసూలు చేసే కెపాసిటీ చిరుకు ఉందని క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతి విజయం తర్వాత చిరంజీవి కూడా కమర్షియల్ కథలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. తనకు రెండు మైల్ స్టోన్ మూవీస్ ఇచ్చిన వీవీ వినాయక్, తన అభిమాని పూరి జగన్నాథ్... ఇప్పుడు ఇద్దరితో కొత్త సినిమా గురించి డిస్కషన్స్ చేస్తున్నారు. 


'లైగర్' ఫ్లాప్ తర్వాత పూరితో...
చిరంజీవితో సినిమా చేయాలనేది డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కల. తనయుడు రామ్ చరణ్ తొలి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని, ప్రేక్షకులు పరిచయం చేసే బాధ్యతను పూరి చేతిలో పెట్టారు మెగాస్టార్. అతడు అంటే అంత నమ్మకం. కానీ, రాజకీయాలకు టాటా బైబై చెప్పేసిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు పూరి జగన్నాథ్ కథ కూడా వివరించారు. అయితే, ఆ సినిమా ఎందుకో పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు మళ్ళీ చిరు - పూరి కాంబినేషన్ వార్తల్లోకి వచ్చింది.


'గాడ్ ఫాదర్'లో పూరి జగన్నాథ్ ఓ క్యారెక్టర్ చేశారు. విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఇద్దరూ ముచ్చటించారు. అప్పుడు మంచి కథ రెడీ చేస్తే సినిమా చేద్దామని చిరు అన్నారు. అప్పటికి 'లైగర్' విడుదలైంది. డిజాస్టరూ అయ్యింది. అయినా సరే చిరు ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అన్నారు. దాంతో కథ రెడీ చేసే పనిలో పూరి పడ్డారు. కట్ చేస్తే... ఇప్పుడు కొత్తగా వీవీ వినాయక్ పేరు వినబడుతోంది. 


'ఠాగూర్', 'ఖైదీ నంబర్ 150' తర్వాత...
దర్శకులలో మెగా అభిమానుల్లో వీవీ వినాయక్ ఒకరు. చిరంజీవిని రెండుసార్లు డైరెక్షన్ చేసే ఛాన్స్ అందుకున్నారు. ఆ రెండు సినిమాలు... 'ఠాగూర్', 'ఖైదీ నంబర్ 150'. రెండూ రీమేకులే. ఈసారి రీమేక్ చేస్తారా? లేదంటే స్ట్రెయిట్ కథతో సినిమా చేస్తారా? అనేది చూడాలి. ఎందుకు అంటే... మూడోసారి డైరెక్ట్ చేయడానికి ముచ్చట పడుతున్నారని, ట్రై చేస్తున్నారని టాక్. 'ఖైదీ నంబర్ 150' తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వినాయక్ తీసిన 'ఇంటిలిజెంట్' ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత 'ఛత్రపతి' హిందీ రీమేక్ స్టార్ట్ చేశారు. అది పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది. గ్యాప్ ఎక్కువ ఉండకూడదని త్వరలో కొత్త సినిమా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. మంచి కథ కుదిరితే చిరుతో సినిమా ఉండొచ్చు. 


Also Read : హాలీవుడ్‌లో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం - ఆ ఘనత అందుకున్న తొలి హీరోగా రికార్డ్


ఇప్పుడు వీవీ వినాయక్ అయినా... పూరి జగన్నాథ్ అయినా సరే... చేయాల్సిన పని ఒక్కటే! కథతో చిరంజీవిని మెప్పించడం! ఎవరి కథ నచ్చితే వాళ్ళతో 'భోళా శంకర్' తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. డీవీవీ దానయ్య నిర్మాణంలో 'ఛలో', 'భీష్మ' చిత్రాల దర్శకుడు వెంకీ కుడుములతో ఓ సినిమా అనౌన్స్ చేసినా, అది పక్కన పెట్టారు. అందువల్ల, 'భోళా శంకర్' తర్వాత చిరంజీవి ప్లానింగ్ మారింది. కొత్త కథల కోసం వెయిట్ చేస్తున్నారు.  


Also Read : పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో ఓ చేంజ్ - మళ్ళీ త్రివిక్రమే!