టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లో తాజాగా ఓ వేడుక జరిగింది. దిల్ రాజు కొడుకు అన్వి రెడ్డి మొదటి పుట్టినరోజు వేడుకలు జూన్ 29 గురువారం సాయంత్రం హైదరాబాదులో చాలా గ్రాండ్గా జరిగాయి. ఇక ఈ వేడుకకి టాలీవుడ్ సినీ తారలంతా తరలివచ్చారు. అగ్ర హీరోల నుంచి డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోయిన్లు అంతా ఈ వేడుకకు హాజరవడం విశేషం. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ, విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, సితార, గోపీచంద్, శ్రీ లీల, ప్రియదర్శి, మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు.. దర్శకులు త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, త్రినాధరావు నక్కిన, శివ నిర్వాణ, గౌతమ్ తిన్ననూరి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, మెహర్ రమేష్, మారుతి, వెంకీ అట్లూరి, గోపీచంద్ మలినేని..నిర్మాతలు సురేష్ బాబు, రాధాకృష్ణ, నాగ వంశీ, అభిషేక్ అగర్వాల్, అల్లు అరవింద్, బెల్లంకొండ సురేష్ బాబు సహా ఇతర సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.






ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వేడుకకు సినీ తారలే కాదు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవడం విశేషం. కాగా దిల్ రాజు 2020లో తేజస్విని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి గత ఏడాది అబ్బాయి జన్మించగా అతనికి అన్వి రెడ్డి అని నామకరణం చేశారు. కాగా దిల్ రాజు మొదటి భార్య అనితకు ఓ కుమార్తె ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈమెకు పెళ్లి అయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దిల్ రాజ్ మొదటి భార్య అనిత చనిపోవడంతో అతని కుమార్తె స్వయంగా తన తండ్రిని బలవంతంగా ఒప్పించి రెండో పెళ్లి చేశారు. ఈ క్రమంలోనే దిల్ రాజు తేజస్విని ని రెండో వివాహం చేసుకున్నాడు.కాగా దిల్ రాజు మొదటి భార్య కుమార్తె ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతుంది. రీసెంట్ గా సంచలన విజయం అందుకున్న 'బలగం' సినిమాకి రాజు కూతురే నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం మరికొన్ని సినిమాలకు ఆమె  నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు.


ఇక దిల్ రాజు విషయానికి వస్తే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' సినిమాని నిర్మిస్తున్నారు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రామ్ చరణ్ సరసన కీయరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్ జె సూర్య, జయరాం, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు  ఇప్పటికే విడుదలైన టైటిల్ మోషన్ టీజర్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసింది. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న మొదటి సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Read : ఓటీటీ లోకి వచ్చేసిన 'విమానం' - ఎక్కడ చూడొచ్చంటే!