కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని, అనసూయ, మాస్టర్ ధృవన్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'విమానం'. శివప్రసాద్ యానాల రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  జూన్ 9 న థియేటర్స్ లో రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మాత కిరణ్ కొర్రపాటి ఈ సినిమాని నిర్మించారు. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మీరాజాస్మిన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. జూన్ 30న (నేడు) ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 లో ప్రీమియర్ గా స్ట్రీమింగ్ అవుతోంది.


ఈ విషయాన్ని తెలుపుతూ ZEE5 తాజాగా ఓ ప్రత్యేక వీడియోని రిలీజ్ చేసింది. కాగా థియేటర్స్ లో ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ని అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమాని కాస్త ముందుగానే ఓటీటీలో రిలీజ్ చేసేసారు మేకర్స్. సాధారణంగా థియేటర్లో విడుదలైన 30 నుంచి 50 రోజుల తర్వాతే ఓటీటీ లో సినిమాని రిలీజ్ చేయాలి. కానీ 'విమానం' సినిమా మాత్రం కాస్త ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ఈ సినిమాని థియేటర్స్ లో మిస్సయిన ఆడియన్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు ZEE5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి.


ఇక 'విమానం' కథ విషయానికి వస్తే.. వికలాంగుడైనా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వీరయ్య(సముద్ర ఖని) భార్య మరణించడంతో తన కొడుకు రాజు (మాస్టర్ ధృవన్)తో కలిసి ఓ బస్తీలో నివసిస్తూ ఉంటాడు. ఆటో స్టాండ్ వద్ద, మరుగుదొడ్ల నిర్వహణతో వచ్చే చాలీచాలని సంపాదనే అతని కుటుంబానికి ఆధారం. ఇక బడికి వెళ్లే వీరయ్య(సముద్ర ఖని) కొడుకు రాజు(మాస్టర్ ధ్రువన్)కి విమానం అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక పైలెట్ కావాలని కలలు కంటూ ఉంటాడు. అయితే రాజు పెద్దయ్యే వరకు కాకుండా నెల రోజుల్లో విమానం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడుతుంది. దాంతో తన కొడుకు కోరికను నెరవేర్చేందుకు తండ్రి వీరయ్య ఏం చేశాడు? రాజుకి అంత తొందరగా విమానం ఎక్కించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అందుకోసం వీరయ్య ఏం చేశాడు? ఇక ఆ బస్తీలోనే ఉండే సుమతి(అనసూయ భరద్వాజ్), కోటి(రాహుల్ రామకృష్ణ), డానియల్(ధన్ రాజ్) జీవితాల వెనుక ఉన్న కధ ఏమిటి? వీరయ్యకి వాళ్ళు ఎలా సాయం చేశారు? అనేది ఈ సినిమా కథ.


కాగా ఒకవైపు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే దర్శకుడిగా కూడా బిజీ అవుతున్నాడు సముద్రఖని. ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'బ్రో' సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. జూలై 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.