టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కి మాతృ వియోగం కలిగింది. విశ్వప్రసాద్ మాతృమూర్తి శ్రీమతి టీజీ గీతాంజలి(70) శుక్రవారం (జూన్ 30) సాయంత్రం సుమారు 6 గంటల 10 నిమిషాల ప్రాంతంలో శివైక్యం చెందారు. దీంతో టీజీ విశ్వప్రసాద్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గీతాంజలి చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ఆమె కోలుకోలేకపోవడంతో ఆమె చివరి కోరిక మేరకు తనయుడు విశ్వ ప్రసాద్ ఆమెను వారణాసి తీసుకెళ్లారు. అక్కడే దైవదర్శనం అనంతరం ఆమె తుది శ్వాస విడిచారు.


గీతాంజలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో విశ్వ ప్రసాద్ పెద్ద కొడుకు. కాగా వారణాసి లోనే తన తల్లి అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్ తెలియజేశారు. ఇక నిర్మాత విశ్వప్రసాద్ మాతృమూర్తి కన్నుమూశారనే విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఇప్పటికే ఎన్నో చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఒకేసారి ఈ పదుల సంఖ్యలో సినిమాలను నిర్మిస్తూ ప్రస్తుతం అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్వరలోనే పీపుల్స్ మీడియా నిర్మాణంలో 50 సినిమాలు కంప్లీట్ చేయబోతున్నట్లు కూడా విశ్వ ప్రసాద్ తెలిపారు.


వాటిలో ప్రస్తుతం 10 సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయని, అంతేకాకుండా తమ బ్యానర్ పై వరుసగా 100 సినిమాలను నిర్మించడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ గా 'రామబాణం', 'టక్కర్' వంటి సినిమాలు ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చినవే. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చాయి. ఇక ఆ నష్టాలను తాజాగా ప్రభాస్ 'ఆదిపురుష్' డిస్ట్రిబ్యూషన్ తో కవర్ చేశారు. 'ఆదిపురుష్' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకోగా.. ఈ సినిమా ద్వారా నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో', ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్స్ ని నిర్మిస్తోంది.


వీటిలో 'బ్రో' జూలై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే ప్రభాస్, మారుతి సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ముందు ముందు తమ బ్యానర్ లో హాలీవుడ్ సినిమాలను కూడా నిర్మించాలని లక్ష్యంతో ఉన్నారు పీపుల్ మీడియా నిర్మాతలు. ఇక టీజీ విశ్వప్రసాద్ కు ఈ ప్రొడక్షన్ హౌస్ తో పాటు యూఎస్ లో పలు బిజినెస్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read : 'కెప్టెన్ మిల్లర్' ఫస్ట్ లుక్ - యుద్ధ భూమిలో అలుపెరగని వీరుడిలా ధనుష్