2021లో డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ అయిన ‘మా ఊరి పొలిమేర’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా ‘పొలిమేర 2’ని కూడా తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుందా? ఓటీటీలో విడుదల అవుతుందా? అన్నది తెలియరాలేదు. 


ఇక టీజర్ విషయానికి వస్తే...


రెండో భాగానికి సినిమా స్పాన్ మరింత పెంచినట్లు అర్థం అవుతుంది. మొదటి భాగం పూర్తిగా ఒక ఊరిలోకే జరుగుతుంది. ఈసారి వేర్వేరు లొకేషన్లలో సినిమా తెరకెక్కించారు. ఒక గుడి నేపథ్యంలో జరిగే కథ అని ఒక ప్రాథమిక అంచనా అయితే వచ్చింది. ‘మనిషిని చంపడం తప్పు కానీ బలిస్తే తప్పేముంది’ లాంటి డైలాగ్స్ కూడా సినిమాలో ఉన్నాయి. గెటప్ శ్రీను, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల క్యారెక్టర్ల లుక్స్‌ను రివీల్ చేశారు.



ఇక 'మా ఊరి పొలిమేర 2' సినిమా విషయానికొస్తే.. ఈ మూవీలో సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవివర్మ, చిత్రమ్ నటించారు. శ్రీను, అక్షత శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డాక్టర్ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించగా, నిర్మతగా గౌరీకృష్ణ వ్యవహరించారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్‌పై గౌర్ క్రిస్నా నిర్మించిన ఈ చిత్రాన్ని ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్‌లోని అనేక సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. మా ఊరి పొలిమేర 2 షూటింగ్ 2022లో ప్రారంభం కాగా.. మూవీ చిత్రీకరణ పూర్తయినట్లు ఇటీవలే చిత్ర నిర్మాతలు ధృవీకరించారు.


'మా ఊరి పొలిమేర 2' మొదటి భాగం కంటే రాబోయే రెండో భాగం మరింత ఉత్కంఠభరితంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను ఈ ఏడాది మే లో రిలీజ్ చేశారు. మంటల మధ్యలో ఓ వ్యక్తి అటుగా తిరిగి నమస్కరిస్తుండగా.. అతని తలపై నుంచి రక్తం ప్రవహించడం సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది.


నటుడు, ఈ చిత్రంలో కథానాయకుడు 'స‌త్యం' రాజేశ్ మాట్లాడుతూ ''గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన 'మా ఊరి పొలిమేర'ను ప్రేక్షకులు ఎంతో ఆద‌రించారు. దానికి సీక్వెల్‌... 'మా ఊరి పొలిమేర 2' త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్నిఅదే విధంగా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను. ద‌ర్శ‌కుడు అనిల్ అద్భుతంగా తెర‌కెక్కించారు. నిర్మాత గౌరికృష్ణ నిర్మాణంలో రాజీ పడలేదు'' అని అన్నారు.