ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఆయన తనయుడు అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులో హీరోయిన్ గుర్తు ఉన్నారా? నరేష్ను పెళ్లి చేసుకుని లావు అమ్మాయిగా గీతా సింగ్ నటించారు. ఆ తరువాత కొన్ని సినిమాలలో క్యారెక్టర్లు చేశారు. కొంత విరామం తర్వాత బ్యాచిలర్స్ ప్రేమకథలుతో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.
పూజతో ప్రారంభమైన 'బ్యాచిలర్స్ ప్రేమకథలు'
గీతా సింగ్ (Geetha Singh)తో పాటు 'బ్యాచిలర్స్ ప్రేమకథలు'లో కార్తీక్, కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ ఇతర ప్రధాన తారాగణం. యస్యం 4 ఫిలిమ్స్ పతాకం మీద ఎంఎన్వి సాగర్ స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. పూజతో ఘనంగా సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా... మరో దర్శకులు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు.
దర్శక - నిర్మాత సాగర్ మాట్లాడుతూ... ''గతంలో నేను తీసిన 'కాలం రాసిన కథలు' చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఉత్సాహంతో దానికి సీక్వెల్గా 'బ్యాచిలర్స్ ప్రేమ కథలు' తీస్తున్నా. దీనిలో మంచి సోషల్ మెసేజ్ ఇస్తున్నా. దీంతో నూతన నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నా. ఈ నెలలో చిత్రీకరణ ప్రారంభించి త్వరగా సినిమా పూర్తి చేస్తాం. ఈ ఏడాది చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నా'' అని అన్నారు.
రీ ఎంట్రీ గురించి గీతా సింగ్ మాట్లాడుతూ... ''ప్రేక్షకుల అందరూ నేను సినిమా చేస్తున్నా అంటే నా క్యారెక్టర్ నుంచి కామెడీ ఆశిస్తారు. అందుకు భిన్నంగా ఈ 'బ్యాచిలర్స్ ప్రేమ కథలు'లో ఎమోషనల్ క్యారెక్టర్ చేస్తున్నా. ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాత సాగర్ గారికి థాంక్స్'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు కార్తీక్, కాశీ మదన్, ఇషాని, శృతి లయ, చలానా అగ్నిహోత్రి తదితరులు పాల్గొన్నారు.