Anushka Sharma on Kohli: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సెలబ్రిటీ జంటల్లో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జోడీ ఒకటి. వారు తమ చిత్రాలు, తమ భాగస్వామితో కలిసి ఉన్న ఫొటోలను పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అభిమానుల్లో వారికి విరుష్క పేరుతో భారీ ఫాలోయింగే ఉంది. ఈ జంట ఒకరికి ఒకరు అండగా నిలవడం, కలిసి సమయాన్ని ఆస్వాదించడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల విరాట్ భార్య అనుష్క తన భర్తను చాలా ఎక్కువగా మిస్సవుతున్నానంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 


మిస్ యూ టూ మచ్


దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత బాలీవుడ్ నటి, కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సినిమాలు చేస్తున్నారు. ఒక చిత్రం షూటింగ్ కోసం ఆమె ప్రస్తుతం ఇంగ్లండ్ లో ఉన్నారు. విరాట్ కూడా కొన్ని రోజులు ఆమెతో పాటు ఉన్నారు. అయితే టీ20 ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ కోసం కోహ్లీ భారత్ తిరిగొచ్చేశాడు. ఈ నేపథ్యంలోనే తన భర్తను ఎంతో మిస్సవుతున్నానంటూ అనుష్క సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కోహ్లీతో కలిసిఉన్న అందమైన ఫొటోతో పాటు ఒక సందేశాన్ని ఉంచారు. 'అందమైన ప్రదేశాలలో ఇష్టమైన వ్యక్తితో ఉంటే బయోబబుల్ లో ఉన్నప్పుడు కూడా ప్రపంచం ప్రకాశవంతంగా, ఉత్సాహంగా, సరదాగా ఉంటుంది. మిస్సింగ్ హబ్బీ టూ మచ్' అంటూ వ్యాఖ్య జోడించారు. 


చక్దా ఎక్స్ ప్రెస్ సినిమా చిత్రీకరణ కోసం గతంలో అనుష్క యూకే వెళ్లారు. అప్పుడు  కోహ్లీ కూడా అక్కడకు వెళ్లి తన భార్యతో విలువైన సమయాన్ని గడిపాడు. అక్కడ తనతో దిగిన అందమైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన సతీమణితో ఒక ఉదయం వేళలో దిగిన సుందరమైన ఫొటోను పంచుకుంటూ 'అందమైన ఉదయం' అని వ్యాఖ్యానించారు. వీరి జంటకు 2021 లో పాప పుట్టింది. ఆమె పేరు వామిక. 


మెగా టోర్నీకి సన్నద్ధం


ఇకపోతే అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభమవుతోంది. ఈ మెగా టోర్నీ కోసం ప్రస్తుతం కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. అక్టోబర్ 23న పాకిస్థాన్ తో మ్యాచ్ తో భారత్ ప్రపంచకప్ టోర్నీని ప్రారంభిస్తుంది. ఇటీవల ఆసియా కప్ తో కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. మునుపటిలా ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. అంతేకాక దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ మార్కును అందుకున్నాడు. ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న కోహ్లీపై భారత్ చాలా ఆశలే పెట్టుకుంది.


ఈ టీ20 ప్రపంచకప్ నకు ముందు టీమిండియా.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్ లు ఆడనుంది. సెప్టెంబర్ 20 నుంచి మొహాలీ వేదికగా ఆసీస్ తో 3 టీ20 ల సిరీస్ ప్రారంభమవుతుంది.