Anchor Anasuya Bharadwaj Birthday Special: ఇండస్ట్రీలో ఈమే ఒక సెన్సేషన్‌. సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టిందంటే చాలా అంతే అదే మాట్లాడుకుంటారు. లక్షల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్నా.. అదే స్థాయిలో విమర్శించే వాళ్లు కూడా ఉన్నారు. అయినా తగ్గేదే లే అంటూ విమర్శకులకు ధీటూగా ఎప్పటికప్పుడు ఇచ్చిపడేస్తుంది. ఆమె మన గ్లోబల్‌ స్టార్ రామ్‌ చరణ్‌ 'రంగమ్మత్త'. ఓ గుర్తుపట్టేశారా? అవును యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌.. ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ లేరు. వెండితెరపై గ్లామర్‌ పాత్రైనా, డి-గ్లామర్‌ రోలైనా తనకు తానే సాటి అనేంతగా నటనతో ఆకట్టుకుంటుంది.


ప్రొఫెషన్‌గా యాంకర్‌ అయినప్పటికీ నటిగా వెండితెరపై తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకుంది. తన యాక్టింగ్‌ స్కిల్స్‌తో‌ ఫ్యాన్స్‌ని ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఓ కామెడీ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు వెండితెరపై మోస్ట్‌ వాంటెడ్‌ యాక్టర్‌గా మారింది. పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. నేడు ఈ హాట్‌ యాంకర్‌, నటి పుట్టిన రోజు. మే 15ను అనసూయ భరద్వాజ్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా న్యూస్‌ రీడర్‌ నుంచి ఓ స్టార్‌ యాక్టర్‌గా ఎదిగిన ఆమె సినీ ప్రయాణంపై ఓ లుక్కేయండి!


మే 19, 1985 నల్గొండ జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో జన్మించింది అనసూయ. ఇంట్లో పెద్దదైన ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు. హైదరాబాద్‌ బద్రుకా కాలేజీలో MBA, HRలో పిజీ చేసింది. ఆ తర్వాత ఓ విజువల్‌ ఎఫెక్ట్‌ కంపెనీలో HR ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసింది. అంతకంటే ముందు చదువుకుంటూనే టెలీకాలర్‌గానూ పని చేసింది. అప్పుడు ఆమె జీతం రూ.5 వేలు మాత్రమేనట. అనసూయ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీలో పనిచేస్తున్నందున అక్కడికి తరచూ సినీ దర్శకుడు వస్తుండేవారట. ఈ క్రమంలో అక్కడ అనసూయను చూసిన డైరెక్టర్‌ సుకుమార్‌ ఆర్య మూవీలో ఓ పాత్ర ఆఫర్ చేశారట. కానీ అప్పుడు నటన అంటే ఇష్టం లేని అనసూయ సున్నితంగా సుకుమార్‌ ఆఫర్‌ను తిరస్కరించానని పలు ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. కాగా తనది ఓ ఉన్నతమైన కుటుంబమేనని, కానీ తన తండ్రి గుర్రపు పందేల వ్యసనం వల్ల ఆస్తులు అన్ని పొగోట్టుకున్నామని తెలిపింది. దీంతో చదువుకునే సమయంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొవాల్సి వచ్చిందని, దాంతో అనసూయ చదువుతూనే టెలికాలర్‌ జాబ్‌ చేసిందట. 


టెలికాలర్‌గా ఉద్యోగం


విజువల్‌ కంపెనీలో HR ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన అనసూయ అనుకోకుండా ఆ జాబ్‌ మానేయాల్సి వచ్చిందట. అప్పటికే నిశ్చితార్థం చేసుకున్న అనసూయ.. పెళ్లి తర్వాత న్యూస్‌ రీడర్‌గా ప్రముఖ చానల్లో చేసింది. అలా మొదటి సారి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చిన అనసూయకు మెల్లిగా ఇండస్ట్రీలో ఆఫర్స్‌ రావడం మొదలయ్యాయి. అప్పటికే కెమెరా అనుభవం పొందిన తనకు నటనపై ఆసక్తి వచ్చిందట. కానీ, తనకు అదే టైంలో ఈటీవీలో కొత్త ప్రసారం చేస్తున్న జబర్దస్త్‌ కామెడీ షోకు యాంకర్‌గా పిలుపు వచ్చింది. అలా జబర్దస్త్‌ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. అలా యాంకర్‌ యమ క్రేజ్‌ సంపాదించుకున్న అనసూయకు అప్పుడే పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల అత్తారింటికి దారేది మూవీలో ఓ చిన్న పాత్ర ఆఫర్‌ వచ్చింది. స్పెషల్‌ సాంగ్‌లో పవన్‌ కళ్యాణ్‌తో కలిసి స్టెప్పులేసే అవకాశం వచ్చింది. కానీ తాను ఈ పాత్ర చేయనంటూ తిరస్కరించడంతో విపరీతమైన ట్రోల్స్‌ ఎదుర్కొంది. 


పవన్‌ సినిమాను రిజెక్ట్‌ చేసి..


యాంకర్‌కే అంత పోగరా? అంటూ పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అంతా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఈ విషయంలో అనసూయ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అంతేకాదు ఆ సినిమా ఆఫర్‌ ఒకే చేసిన తనకు పెద్దగా గుర్తింపు వచ్చి ఉండేది కాదని, అందరిలో ఒకరిగా మిగిలిపోయేదాన్ని అని వివరణ ఇస్తూ ట్వీట్‌ చేసింది. ఇక అప్పటి నుంచి మొదలు. అనసూయ ఏం చేసిన అది సెన్సేషన్‌ అయ్యింది. అప్పట్లో ఆమె ట్వీట్‌పై విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. చాలా కాలంగా పాటు ఆమెను పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ట్రోల్ చేస్తూ వచ్చారు. అయినా కూడా ఆమె ఎక్కడ వెనక్కి తగ్గలేదు. కథ ప్రాధాన్యత ఉన్న పాత్ర వస్తనే చేస్తానంటూ మొండిగా ఉంది. దాంతో మళ్లీ సుకుమార్‌ నుంచి ఆఫర్‌ వచ్చింది. అప్పుడే రామ్‌ చరణ్‌ 'రంగస్థలం'లో రంగమ్మత్త పాత్ర కొట్టేసింది. అప్పటి వరకు బుల్లితెరపై ఫుల్‌ గ్లామర్‌ షో చేసి హాట్‌ యాంకర్‌గా గుర్తింపు పొందిన అనసూయ.. రంగస్థలంలో డీ-గ్లామర్‌ రోల్‌ చేసింది. ఇందులో రంగమ్మత్త పాత్ర ఎంతగా ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పునవరం లేదు. 


ఈ దెబ్బతో అనసూయ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఎక్కడికి వెళ్లినా రంగమ్మత్త రంగమ్మత్త అంటూ ఆమె పాత్ర గుర్తు చేస్తుండేవారు. ఈ పాత్రకు అంతగా ఫేమ్‌ వస్తుందని ఆమె కూడా ఊహించలేదట. ఈ దెబ్బతో అనసూయ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఇక వెండితెరపై బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాంకర్‌గా రాణించింది. కానీ, పలు వ్యక్తిగత కారణాల వల్ల తనకు ఫేం తెచ్చిపెట్టిన జబర్దస్త్‌ కామెడీ షోను విడాల్సి వచ్చింది. అక్కడ వేసే డబుల్‌ మీనింగ్‌ జోక్స్‌.. యాంకర్‌పై చిన్న చూపు కారణంగానే తాను ఆ షో విడాల్సి వచ్చిందని పలు ఇంటర్య్వూలో స్పష్టం చేసింది. యాంకరింగ్‌కు గుడ్‌బై చెప్పిన అనసూయ ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. దీంతో ప్రస్తుతం అనసూయ ఒక్క తెలుగులోనే కాదు తమిళం, కన్నడలోనూ ఆఫర్స్‌ అందుకుంటుంది. ఇక తెలుగులో పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప 2' మూవీతో బిజీగా ఉంది. అలాగే పలు చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తుంది.


విజయ్‌ దేవరకొండతో వివాదం


ఇక రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌, అనసూయ మధ్య ట్వీట్ల వార్‌ గురించి తెలిసిందే. విజయ్‌ని విమర్శిస్తూ పరోక్షంగా అనసూయ ట్వీట్స్‌ చేస్తుండేది. దీంతో ఈ రౌడీ హీరో ఫ్యాన్స్‌ ఆమెను టార్గెట్‌ చేస్తూ ట్రోల్‌ చేసేవారు. అర్జున్‌ రెడ్డిలో ఆడవాళ్లను తక్కువగా చేసిన చూపించిన విజయ్‌ పాత్రపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసింది. దీంతో అప్పటి నుంచి సందర్భంగా వచ్చినప్పుడల్లా విజయ్‌పై పరోక్షంగా ట్వీట్‌ వదిలింది. లైగర్‌ మూవీ టైంలోనూ ది విజయ్‌ దేవరకొండ అంటూ తన పేరు పక్కన ది వాడటంపై అనసూయ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రముఖమైన. ప్రత్యేకమైన వాటికి వాడే ది అనే పదాన్ని విజయ్‌ పేరు ముందు చేర్చడం ఎంతవరకు కరెక్ట్‌ అంటూ వ్యతిరేకత చూపించింది. దీనిపై కూడా విజయ్‌ ఫ్యాన్స అనసూయతో ట్వీట్‌ వార్‌కు దిగారు. అప్పట్లో అంశం సోషల్‌ మీడియాలో ఫుల్‌ రచ్చ లేపింది. కానీ తగ్గేదే లే అంటూ ప్రతి నెటిజన్‌కు ఇచ్చిపడేసింది ఈ డేరింగ్‌ యాంకర్‌.