పాన్ ఇండియా వైడ్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘పుష్ప ది రూల్‌’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది 2021 చివర్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన 'పుష్ప: ది రైజ్' చిత్రాన్ని సీక్వెల్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేసారు. 2024 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే అదే టైంలో మరో రెండు క్రేజీ చిత్రాల విడుదల ఉండటంతో ఈసారి బాక్సాఫీస్ వార్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇప్పటి నుంచే లెక్కలు వేయడం మొదలుపెట్టారు. 


'పుష్ప 2' సినిమాకి ఆగస్టు 15వ తేదీ పర్ఫెక్ట్ రిలీజ్ గా ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇండిపెండెన్స్ డే హాలిడే ఈసారి గురువారం వస్తోంది. ఆగస్టు 19 సోమవారం ఎలాగూ రక్షా బంధన్ ఫెస్టివల్ సెలవు ఉంది. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేయడానికి 5 రోజుల లాంగ్ వీకెండ్ దొరుకుతుంది. అలానే ఆ తర్వాతి వారంలో ఆగస్టు 26 సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. దీని ప్రకారం రెండవ వారాంతంలోనూ 4 రోజుల లాంగ్ వీకెండ్ లభించినట్లు అవుతుంది. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడానికి పుష్పరాజ్ కు ఇది సరైన విడుదల తేదీ భావించవచ్చు. 


అయితే 'పుష్ప 2' సినిమాకి సోలో రిలీజ్ దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే అదే డేట్ కి 'సింగం 3' వంటి హిందీ మూవీ విడుదల కాబోతోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో సీనియర్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇది 'సింగం' ప్రాంచైజీలో వస్తోన్న మూడో సినిమా. 2024 ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు 'పుష్ప: ది రైజ్' సినిమాని కూడా అదే సమయంలో విడుదల చేయాలని ఫిక్స్ అవ్వడంతో అల్లు అర్జున్ vs అజయ్ దేవగన్ క్లాష్ కంఫర్మ్ అయింది. 


Also Read:  పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ మార్క్ సెటైరికల్ ట్వీట్!


'పుష్ప 2' సినిమాపై నెలకొన్న అంచనాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఈసారి 1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ గ్యారంటీ అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయ పడుతున్నారు. కానీ 'సింగం ఎగైన్' నార్త్ బెల్ట్ లో బన్నీ చిత్రానికి పోటీగా మారే అవకాశం ఉంది. ఇది చాలదన్నట్టు 'ఇండియన్ 2' మూవీ కూడా వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని టార్గెట్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. షో మ్యాన్ శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. పాతికేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. 


ఒకవేళ 'పుష్ప 2', 'సింగం 3', 'ఇండియన్ 2' సినిమాలు రాబోయే ఆగస్టు 15న విడుదలైతే మాత్రం.. 2024లో క్లాష్ ఆఫ్ సీక్వెల్స్ ని చూడబోతున్నామని చెప్పాలి. తమిళ్ లో కమల్ హాసన్ మూవీకి, హిందీలో అజయ్ దేవగన్ సినిమాకి క్రేజ్ ఉంటుంది. 'పుష్ప' పార్ట్-1 విజయాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే, అల్లు అర్జున్ చిత్రానికి తెలుగు హిందీలలో మంచి మార్కెట్ ఏర్పడవచ్చు. మరి పుష్పరాజ్ ను ఢీకొట్టే ధైర్యం ఎవరు చేస్తారు? చివరకు ఈ మూడు చిత్రాల్లో ఏవేవి బాక్సాఫీస్ బరిలో నిలుస్తాయో వేచి చూడాలి. 


Also Read: నాగచైతన్య బాటలో విజయ్ దేవరకొండ - కానిస్టేబుల్‌‌గా రౌడీ బాయ్?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial