సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్‌’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ విజయంతో దూకుడు మీదున్న తలైవా.. మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. తన తదుపరి సినిమా కోసం టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తో చేతులు కలపబోతున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. Thalaivar171 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ విషయాన్ని మేకర్స్ సోమవారం అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.


‘సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 171వ చిత్రాన్ని మేం నిర్మించనున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాం. దీనికి లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం సమకూరుస్తారు. అన్బరీవ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తారు’ అని నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా Thalaivar171 ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను పంచుకున్నారు. దీన్ని బట్టి ఇది యాక్షన్ జోనర్ మూవీ అని తెలుస్తోంది.


ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో లోకేశ్ కనగరాజ్ ఒకరు. 'ఖైదీ' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన లోకేశ్.. విజయ్ తో 'మాస్టర్' మూవీ తీసి హిట్టు కొట్టాడు. అలానే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కు 'విక్రమ్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించారు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌ ను సృష్టించి ఆశ్చర్య పరిచాడు. పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం విజయ్ తో 'లియో' చేస్తున్న దర్శకుడు.. ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే తలైవాతో ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యాడు.


రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ కలయికలో సినిమా కోసం చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్ గా సన్ పిక్చర్స్ ఈ క్రేజీ కాంబినషన్ ను సెట్ చేసింది. 'జైలర్' సక్సెస్ తర్వాత 'విక్రమ్' దర్శకుడితో సినిమా అనౌన్స్ చేయడంతో తలైవర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈసారి రికార్డ్స్ బ్రేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు. మరోవైపు లోకేష్ కూడా రజనీని డైరెక్ట్ చేయడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు ట్వీట్‌ చేశారు. 






లోకేష్ కనగరాజ్ తన LCU లో 'ఖైదీ 2', 'రోలెక్స్', 'విక్రమ్ 2' వంటి చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు. లియో కూడా ఈ ఫ్రాంచైజీలో భాగమే అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రజనీకాంత్ సైతం Thalaivar171 ప్రాజెక్ట్ తో ఈ మల్టీవర్స్ లో భాగం అవుతారేమో అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా స్టార్ హీరోలతో కూడా వీలైనంత తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేసే లోకేష్.. తలైవాతో అంతే ఫాస్ట్ గా మూవీ తీసి పెడతారని భావించవచ్చు.


రజనీకాంత్‌ ప్రస్తుతం తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కిస్తున్న 'లాల్ సలామ్' సినిమాలో స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ స్పోర్ట్స్ డ్రామా త్వరలోనే విడుదల కానుంది. దీని తర్వాత 'జై భీమ్' ఫేమ్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో Thalaivar170 మూవీ చేయనున్నారు రజినీ. ఇదే క్రమంలో లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.


Also Read: నాగచైతన్య బాటలో విజయ్ దేవరకొండ - కానిస్టేబుల్‌‌గా రౌడీ బాయ్?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial