2023 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘2018’ ఒకటి. కేరళలో సంభవించిన వరదల ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్, బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకా థియేటర్లలో మంచి నంబర్స్ నమోదు చేస్తున్న ఈ మూవీ.. నెల రోజుల్లోనే డిజిటల్ వేదిక మీదకు వస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 


‘2018’ సినిమా డిజిటల్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకుంది. మాలీవుడ్ స్టార్ టోవినో థామస్ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ ను మేకర్స్ ధృవీకరించారు. జూన్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంటే విడుదలైన 34 రోజులకు ఓటీటీలోకి రాబోతోందన్నమాట. అయితే అదే రోజున తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది.


Read Also: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!


‘2018’ చిత్రాన్ని మే 5న పరిమిత స్క్రీన్స్ లో మలయాళంలో రిలీజ్ చేసారు. ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ పొందడమే కాదు, అద్భుతమైన మౌత్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాతలు గత వారం దేశవ్యాప్తంగా పలు ఇతర భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. మే 26న తెలుగులో బన్నీ వాసు రిలీజ్ చేసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాలుగు రోజుల్లో నాలుగు కోట్లను వసూలు చేసింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కంఫర్మ్ చేయడంతో, తెలుగులో ఇంత త్వరగా స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 


ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 160 కోట్లు రాబట్టి, మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే, 2018 బాక్సాఫీస్ సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేయని మేకర్స్.. ఎర్లీ స్ట్రీమింగ్ చేయడానికి ఓటీటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ విడుదలను వాయిదా వేయాలని నిర్మాతలు మొదట భావించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దీనిపై స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫారమ్ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న డిజిటల్ హక్కుల అమ్మకపు ధరలను తగ్గించుకునేలా కండిషన్ పెట్టారట. దీనికి మేకర్స్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో, ఎర్లీ స్ట్రీమింగ్ ను కొనసాగించాలని నిర్ణయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


కాగా, '2018' చిత్రానికి జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించగా, వేణు కున్నప్పిలి నిర్మించాడు. ఇందులో టోవినో థామస్ తో పాటుగా కుంచకో బోబన్‌, అసిఫ్‌ ఆలీ, అపర్ణ బాలమురళి, లాల్‌, తన్వి రామ్, నరేన్, కలై అరసన్, వినీత్ శ్రీనివాసన్, అజు వర్గీస్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో రికార్డుల మోత మోగిస్తోన్న ఈ సినిమా, డిజిటల్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


Read Also: 'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!