తెలుగు ఓటీటీలో 'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ ఒక సంచలనం. వీక్షకులు మళ్ళీ మళ్ళీ చూసిన సిరీస్ ఇది. నిజానికి, ఈ మధ్య వచ్చిన వెబ్ సిరీస్, సినిమాల్లో ఈ స్థాయి విజయం సాధించినది మరొకటి లేదు. దీనికి దర్శకుడు మహి వి. రాఘవ్ (Mahi V Raghav) క్రియేటర్ అండ్ ప్రొడ్యూసర్. ఏప్రిల్ నెలాఖరున ఆ సిరీస్ విడుదలైంది. ఇప్పుడు జూన్ 15న మహి వి. రాఘవ్ తీసిన మరో వెబ్ సిరీస్ వస్తోంది. 


సైతాన్... కామెడీ కాదు, క్రైమ్!
మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'సైతాన్' (Shaitan Web Series). జూన్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'సేవ్ ద టైగర్' విడుదలైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) ఓటీటీలో ఈ సిరీస్ సైతం విడుదల కానుంది. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.


'సైతాన్'లో ఎవరెవరు ఉన్నారు?
'సేవ్ ద టైగర్స్'లో లాయర్ రేఖ (చైతన్య కృష్ణ భార్య) పాత్రలో నటించిన దేవయాని శర్మ ఉన్నారు కదా! ఫస్ట్ లుక్ చూస్తే... ఆవిడ కనిపించరు. మలయాళ నటి, తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్న షెల్లీ నబు కుమార్, నటుడు రిషి కూడా ఉన్నారు. కమల్ హాసన్ 'విక్రమ్' సహా పలు తమిళ సినిమాల్లో నటించిన జాఫర్ సాధిక్ సైతం ఉన్నారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'లో అఖిల్ అక్కినేని స్నేహితురాలిగా, 'మా ఊరి పొలిమేర'లో కథానాయికగా, 'విరూపాక్ష'లో కమల్ కామరాజు భార్య పాత్రలో నటించిన తెలుగమ్మాయి కామాక్షీ భాస్కర్ల ఓ పాత్ర చేసినట్టు తెలిసింది. 


పోలీసును ఎందుకు చంపేశారు?
'సైతాన్' ఫస్ట్ లుక్ చూస్తే... రిషి, దేవయాని, షెల్లీ, జాఫర్ కలిసి ఓ పోలీసును హత్య చేసినట్టు అర్థం అవుతోంది. ఎందుకు చంపారు? అనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది. ''మీరు నేరం అని దేనిని అయితే అంటున్నారో... వాళ్ళు దానిని మనుగడ కోసం చేసిన పనిగా చెబుతున్నారు'' అని మహి వి. రాఘవ్ పేర్కొన్నారు. క్రైమ్ జానర్ ప్రాజెక్ట్ చేయడం ఆయనకు ఇదే తొలిసారి. 


ఒక్కసారి గేరు మార్చిన మహి!
'సేవ్ ద టైగర్స్'లో ప్రతి ఇంట్లో భార్య భర్తల మధ్య జరిగే సన్నివేశాలను కథగా మలిచి మహి వి. రాఘవ్ కొత్తగా చూపించారు. ఆయన ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి. తెలుగులో హారర్ కామెడీలు కుప్పలు తెప్పలుగా వస్తున్న రోజుల్లో 'ఆనందో బ్రహ్మ' తీశారు. అందులో ఓ కొత్తదనం ఉంటుంది... మనుషులను చూసి దెయ్యాలు భయపడితే? కాన్సెప్ట్ తీసుకుని మహి వి. రాఘవ్ నవ్వించారు. అయితే, ఇప్పటి వరకు ఆయన తీసినవి కామెడీ అండ్ ఎమోషనల్ కథలే. 'సైతాన్'లో కూడా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయట! అయితే... క్రైమ్ నేపథ్యంలో మహి వి. రాఘవ్ ఎలా తీశారో చూడాలి.


Also Read : ఎన్టీఆర్ గాంధీగా మారిన వేళ - నెహ్రూ ఆశ్చర్యపోయిన సభ


త్వరలో మహి వి. రాఘవ్ నుంచి ఓ సినిమా రాబోతోంది. 'యాత్ర' సినిమాకు కొనసాగింపుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కథతో 'యాత్ర 2' చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఆ సినిమాలో జగన్ పాత్రకు తమిళ హీరో జీవా పేరు పరిశీలనలో ఉందట. 


Also Read : 'ఆదిపురుష్' తెలుగు థియేట్రికల్ రైట్స్ రేటు యమా ఘాటు - ఇది భారీ డీల్ రామా!