యువ హీరో సుమంత్‌ ప్రభాస్‌ స్వీయ దర్శకత్వంలో ఛాయ్‌ బిస్కెట్‌ టీమ్‌ నిర్మించిన తాజా చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. టాలీవుడ్‌ కు చెందిన ప్రముఖులు ఈ సినిమా ప్రమోషన్స్‌ లో భాగం అవడంతో, విడుదలకు ముందే సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసంలు లభించాయి. తాజాగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాపై, సుమంత్‌ ప్రభాస్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా బాగుందని, ప్రతిఒక్కరూ తప్పకుండా చూడాలని ట్వీట్ చేసారు. 


రాజమౌళి ట్వీట్ చేస్తూ.. ‘‘చాలాకాలం తర్వాత థియేటర్‌లో ఒక చిత్రాన్ని ఫుల్‌ గా ఎంజాయ్‌ చేశాను. ఈ సుమంత్ ప్రభాస్ కోసం ఈ సినిమా చూడండి. నటుడిగా, దర్శకుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంది. అన్ని పాత్రలు చాలా చక్కగా తీర్చిదిద్దారు. అలాగే నటీనటులు అందరూ సహజంగా నటించారు. ముఖ్యంగా అంజి మామ చాలా బాగా నటించాడు. ఈ సినిమా చూడమని అందరికీ సిఫార్సు చేయండి. యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే.. ధమ్‌ ధమ్‌ చేయొద్దు. #MemFamous’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌ గా మారింది.






భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన రాజమౌళి తమ సినిమాని మెచ్చుకుంటూ ట్వీట్ చేయడంతో 'మేమ్ ఫేమస్' టీమ్ ఉబ్బితబ్బిబ్బు అవుతోంది. దీనికి హీరో కమ్ డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ కృతజ్ఞతలు చెబుతూ, ట్విట్టర్ లో ఓ పెద్ద నోట్ షేర్ చేసాడు. ''థాంక్యూ సో మచ్ సార్. మా సినిమాకి మీ సపోర్ట్ ఊహించలేనిది. మీ ఒక్కొక్క మాట మాకు 1000% బూస్ట్ ఇచ్చింది. మీరు ఉండే బిజీలో కూడా మా కోసం ఒక 2 గంటల 30 నిమిషాల టైం తీసుకొని మూవీ చూసారు. మీ ఫీలింగ్ ని మాతో షేర్ చేసుకొని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఒక ఫ్యాన్ బాయ్ గా నేను ఘోరంగా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నాను. నా డెబ్యూ ఫిలింకి మీ నుంచి ఇలాంటి ప్రశంసలు దక్కడం నాకు పెద్ద అచీవ్మెంట్. మా యూత్ అందరికీ ఇది ఘోరంగా ఎంకరేజ్ మెంట్ అవుతుంది. బరువులు లేపి చేతి బొక్కలు గట్టిగా చేస్తా, జిందగీ మొత్తం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా సార్. ది పేస్ ఆఫ్ ఇండియన్ సినిమా. మేమ్ ఫేమస్'' అని సుమంత్ ప్రభాస్ రాసుకొచ్చాడు. 


కాగా, 'మేమ్ ఫేమస్' సుమంత్‌ ప్రభాస్‌ కు డైరెక్టర్ గా హీరోగా డెబ్యూ మూవీ. అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరుగుతూ జీవితాన్ని గడిపే ముగ్గురు స్నేహితులు.. ఫేమస్‌ అవ్వడానికి, అంద‌రితో శభాష్ అనిపించుకోవడానికి ఏం చేశారు? అనే కథాంశంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. చాయ్ బిస్కెట్ ఫిలింస్ & లహరి ఫిలింస్‌ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శ‌ర‌త్ చంద్ర, చంద్రు మ‌నోహ‌ర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, మూడు రోజుల్లోనే రూ.3 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. 


Read Also: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!