ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఏ సీజన్ లో కూడా లేడీ కంటెస్టెంట్ విన్నర్ కాలేదు. మొదటి సీజన్ లో శివ బాలాజీ, రెండో సీజన్ లో కౌశల్, మూడో సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్, నాల్గో సీజన్ లో అభిజీత్, ఐదో సీజన్ లో సన్నీ విన్నర్స్ గా నిలిచారు. రెండో సీజన్ లో గీతామాధురి, మూడో సీజన్ లో శ్రీముఖి టైటిల్ గెలిచే అవకాశం ఉన్నా.. రన్నరప్ టైటిల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

 

అయితే తొలిసారి బిగ్ బాస్ తెలుగులో లేడీ కంటెస్టెంట్ విన్నర్ గా నిలిచింది. ఆమె మరెవరో కాదు.. బిందు మాధవి. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన బిందు మాధవి తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది. 'ఆడపులి' అనే ట్యాగ్ తో రచ్చ చేసింది. నిజానికి ఈమె తమిళ బిగ్ బాగ్ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఫైనల్స్ వరకు చేరుకుంది. కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకు వచ్చేసింది. 

 

బిగ్ బాస్ నాన్-స్టాప్ షోలో ఛాలెంజర్ గా ఎంట్రీ ఇచ్చింది. తనకు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో ఆడిన అనుభవం ఉండడంతో మొదటి నుంచి చాలా జాగ్రత్తగా గేమ్ ఆడేది. ఫిజికల్ టాస్క్ లకు దూరంగా ఉన్నా.. తన మాటలు, ఆలోచనా తీరుతో అందరినీ ఆకట్టుకుంది. నామినేషన్స్ లో ఒక్కోసారి తన బిహేవియర్ తో విసిగించినా.. తన తప్పుని అర్ధం చేసుకొని సరిచేసుకునేది. 

 

హౌస్ లో ఎన్ని గ్రూప్స్ ఉన్నా.. సోలోగా గేమ్ ఆడేది. ఒక్క శివతో మాత్రమే క్లోజ్ గా ఉండేది. అలా అని ఈ ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఆడింది లేదు. గేమ్ విషయంలో ఎవరి స్ట్రాటజీ వాళ్లదే. మొదటి నుంచి అఖిల్ తో బిందుకి పడేది కాదు. ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం.. 'అరేయ్.. ఒసేయ్' లాంటి మాటలు అనుకోవడం హాట్ టాపిక్ అయ్యేది. మధ్యలో ఒక టాస్క్ లో ఇద్దరూ కలిసి ఆడాల్సి వచ్చినప్పుడు.. వారి గొడవలు పక్కన పెట్టేసి తమ గేమ్ తో అందరినీ మెస్మరైజ్ చేశారు. 

 

బిగ్ బాస్ నాన్-స్టాప్ షోలో ఈ ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది. హౌస్ లో ఫైనల్స్ వరకూ ఉన్నా.. అఖిల్, బిందు మాత్రం తమ గొడవలు సార్ట్ అవుట్ చేసుకోలేదు. ఈ విషయంలో చాలా మంది బిందు మాధవిని సపోర్ట్ చేశారు. పైగా ఆమెకి క్రేజ్ ఉండడంతో, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉండడంతో ఓట్లు బాగా పడ్డాయి. ఎన్ని సార్లు నామినేషన్స్ లో ఉన్నా సేవ్ అవుతూ వచ్చింది. ఒకానొక సమయంలో ఆమెనే విన్నర్ అనే ఫీలింగ్ కి వచ్చేశారు జనాలు.
  

 

దానికి తగ్గట్లే ఓటింగ్ జరిగింది. ఫైనల్స్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. టాప్ 2లో అఖిల్, బిందు నిలిచారు. వారిద్దరినీ స్టేజ్ పైకి తీసుకొచ్చిన నాగ్.. కాసేపు టెన్షన్ పెట్టి బిందు మాధవిని విన్నర్ గా అనౌన్స్ చేశారు. అఖిల్ ఎంత కష్టపడి ఆడినా.. బిందు మాధవి టైటిల్ కొట్టేసి అతడికి షాకిచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో లేడీ కంటెస్టెంట్ విన్నర్ గా నిలిచి చరిత్ర సృష్టించింది.