ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి టాలీవుడ్ నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు. తమ సమస్యలను ఓపికగా విని పరిష్కారం చూపుతామని మంత్రి పేర్ని నాని వెల్లడించినట్లు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద సహకారం ఇచ్చారని.. ఇది ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన భరోసా అని తెలిపారు. దివంగత వైఎస్సార్ సినీ ఇండస్ట్రీకి ఎంతో చేశారని.. ఇప్పుడు జగన్ కూడా అలానే చేస్తున్నారని ప్రశంసించారు. 

 


 

ఇదిలా ఉండగా.. ఆన్ లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతో పాటు దిల్ రాజు, డీఎన్వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. ఈ మీటింగ్ లో ముఖ్యంగా ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చర్చించారు. 

 

ఆన్ లైన్ టికెట్ విధానం తామే అడియామని నిర్మాత సి.కళ్యాణ్ పేర్కొన్నారు. దాంతో పాటు 4 షోలను 12 గంటలలోపు పూర్తి చేయడంపై చర్చించినట్లు తెలిపారు. కరెంట్ బిల్స్ విషయం, 100 శాతం ఆక్యుపెన్సీపై కూడా చర్చించామని అన్నారు. అన్ని వర్గాలు ఈరోజు చర్చల విషయంలో ఆనందంగా ఉన్నాయని.. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ప్రభుత్వం చెప్పిందని త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అవుతామని వెల్లడించారు. 

 

సినిమా సమస్యలపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నిర్మాత డీఎన్వీ ప్రసాద్ పేర్కొన్నారు. సినిమా పరిశ్రమకు ఉన్న సమస్యలపై మంత్రి పేర్ని నాని, అధికారులతో చర్చ జరిగిందని దీనివల్ల తెలుగు సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుందని అన్నారు. తప్పనిసరిగా మరొక సమావేశం ఉంటుందని తెలిపారు. ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ అనేది పెద్ద సమస్య కాదని అన్నారు.