ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 


జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటినుంచే సినిమా ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగా ముందుగా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ద‌స‌రా కానుకగా.. అక్టోబ‌రు 2న 'ఆదిపురుష్‌' ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు రానుంది. ఇకపై వ‌రుస‌గా 'ఆదిపురుష్‌'కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని చిత్ర‌బృందం భావిస్తోంది. ఈసారి దీపావ‌ళి కూడా అక్టోబ‌రులోనే వచ్చింది. అక్టోబ‌రు 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు.. 24న దీపావ‌ళి. అప్పుడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది.


ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. ఫారెన్ లో ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు రూ.250 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంటే.. పెట్టిన బడ్జెట్ లో సగమన్నమాట. డిజిటల్ రైట్స్ తోనే ఇంత మొత్తం వచ్చిందంటే.. ఇక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో చూడాలి!


హాలీవుడ్ లో 'ఆదిపురుష్': 
ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాతలు వెల్లడించారు. దీనికోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా 'ఆదిపురుష్' రిలీజ్ చేయాలనుకుంటున్నారు.


'ఆదిపురుష్' కోసం 35,000 షోలు: 
వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో షోలు వేసేలా ప్లాన్ చేస్తున్నారట.ఇండియా మొత్తం మీద, టోటల్ ఎన్ని థియేటర్లు, లేదంటే స్క్రీన్‌లు ఉన్నాయి? అంటే... సుమారు 9,500 అని చెప్పాలి. అందులో ఆరున్నర వేలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు! మిగతావి మల్టీప్లెక్స్ స్క్రీన్‌లు. గతంలో పది వేలకు పైగా ఉండేవి. కరోనా కాలంలో కొన్ని సింగిల్ స్క్రీన్‌లను గోడౌన్, షాపింగ్ కాంప్లెక్స్‌లు మార్చేశారు. ప్రస్తుతం ఉన్నవాటిలో వీలైనన్ని స్క్రీన్‌ల‌లో 'ఆదిపురుష్' సినిమా ప్రదర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి.


ఒక్కో థియేటర్‌లో రోజుకు నాలుగు ఆటలు ప్రదరిస్తారు. ఐదు షోలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో... రోజుకు 40,000 షోస్ వేయొచ్చు. వెయ్యి , పదిహేను వందల థియేటర్లు వేరే సినిమాలకు వదిలేసినా... ఎనిమిది వేల థియేటర్లలో 'ఆదిపురుష్' విడుదల చేస్తే? కొన్ని థియేటర్లలో నాలుగు షోలు, కొన్ని థియేటర్లలో ఐదు షోలు వేస్తే? రోజుకు సుమారు 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్‌సైడ్‌ టాక్.


Also Read: క్రియేటివిటీకి కళ్లజోడు పెడితే.. సింగీతం శ్రీనివాసరావు 



Also Read : రాంగ్ రూట్‌లో ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో'? - సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న డౌట్స్ ఇవే!